COVID-19 | మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. కేసుల సంఖ్య భారీగా విపరీతంగా పెరుగుతున్నది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.50లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మహమ్మారి కారణంగా 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 17 వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 77కోట్లు దాటగా.. వైరస్ కారణంగా 70లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 1.18లక్షల మంది రోగులు ఆసుపత్రుల్లో చేరారు.
ఇందులో 1600 మందికిపైగా రోగుల పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య 23 శాతం పెరిగిందని, ఐసీయూలో చేరిన రోగుల సంఖ్య 51 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్ సబ్వేరియంట్ జేఎన్.1 కేసులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వేరియంట్తో పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ చలి పెరుగుతున్న కొద్ది పలు దేశాల్లో శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం సైతం పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
కొవిడ్ కొత్త వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లతో దీన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనాతో పాటు శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లుఎంజా, ఆర్ఎస్వీ (Respiratory syncytial virus), న్యుమోనియా తదితర వ్యాధులు సైతం భారీగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్క్లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.