Big Social distance | చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతున్నది. చాలా నగరాల్లో మళ్లీ లాక్డౌన్ విధించారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా పేషెంట్ల కోసం ఏకంగా జైలు లాంటి గదులను ఏర్పాటు చేసిన చైనా.. ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టింది. కొవిడ్ పేషెంట్ను క్రేన్కు కట్టి కంటైనర్లోకి చేర్చుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. చైనాలో వరుసగా మూడవ రోజు కూడా 1,000 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరిన్ని ఆంక్షలను విధించింది. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు చైనా అధికారులు చాలా శ్రమిస్తున్నారు.
కరోనాకు గురైన వ్యక్తి ద్వారా మరొకరికి కాంటాక్ట్ కాకూడదని అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోగి శరీరంలోని ఒక్క బ్యాక్టీరియా కూడా నేలపై ఉండకూడదన్న సూచనలతో పనిచేస్తున్నారు. చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే, ఈ వీడియో ఏ నగరానికి చెందినదో తెలియరాలేదు. ఈ వీడియోను చైనీస్ రచయిత ఫాంగ్ బౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. కరోనా పాజిటివ్ రోగిని క్రేన్ ద్వారా వార్డుకు తీసుకెళ్తున్నారు.. అని ఆయన ఫొటో కాప్షన్ రాశారు.
中国式现代化。【方老师,投稿一个防疫大革命的荒谬视频。一个阳性患者被吊机吊出小区,因为他们不敢进去接,也不想患者的细菌留在地板上,这样能保证最小的接触面积。】 pic.twitter.com/2BM3Afm3V6
— 方舟子 (@fangshimin) October 25, 2022
చైనా అధికారులు ఒక కోవిడ్ పాజిటివ్ రోగిని క్రేన్ సహాయంతో పైకి ఎత్తి సమీపంలో ఉన్న కంటైనర్ గదికి తరలించడం ఈ వీడియోలో గమనించవచ్చు. సామాజిక దూరం పాటించడం అంటే మరీ ఇంత ప్రమాదకరంగా అని అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు మీటర్ల సామాజిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్లో పేర్కొన్నప్పటికీ.. చైనా అధికారులు మాత్రం రోగి వద్దకు వచ్చేందుకు జంకి ఆయన్ని ఎత్తేందుకు భారీ క్రేన్ను ఎంచుకోవడం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది.