బీజింగ్, డిసెంబర్ 20: చైనాలో కరోనా కోరలు చాస్తున్నది. ఇటీవల జిన్పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆంక్షల ఎత్తివేత తర్వాత దేశంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కరోనా వైరస్ బాధితులతో దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయని అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ వెల్లడించారు. రానున్న రోజుల్లో చైనాలో కొవిడ్ మరింత తీవ్రరూపం దాలుస్తుందని, వచ్చే 90 రోజుల్లో చైనా జనాభాలో 60 శాతం మంది, ప్రపంచ జనాభాలో 10 శాతం మందికి కొవిడ్ సోకే ప్రమాదం ఉన్నదని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేస్తున్నారని హెచ్చరించారు. ఇదే సమయంలో లక్షల సంఖ్యలో మరణాలు ఉండే అవకాశం ఉన్నదని, ఇది ఆరంభం మాత్రమేనంటూ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో కొవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ.. చైనా పరిస్థితులతో ప్రపంచ దేశాల్లో మరోసారి కొవిడ్ ఆందోళన రేగింది.
భయానక పరిస్థితులు..
చైనాలో భారీగా కొవిడ్ మరణాలు చోటుచేసుకొంటున్నట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఈ మేరకు గణాంకాలు వెల్లడి కానప్పటికీ, కొవిడ్ మరణాలు పెరిగిన కారణంగా అదనపు షిఫ్ట్లు పనిచేయాల్సి వస్తుందని పలు మార్చురీల వద్ద ఉండే కార్మికులు చెబుతుండటం గమనార్హం. దవాఖానలు, శ్మశానవాటికల వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్టు చూపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజధాని బీజింగ్లో సోమవారం రెండు, మంగళవారం ఐదు కరోనా మరణాలు నమోదైనట్టు అధికారులు ప్రకటించినప్పటికీ, వాస్తవానికి మరణాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతున్నది. బీజింగ్లోని కొన్ని శ్మశాన వాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొన్నది. మరోవైపు శ్వాసకోస వైఫల్యం కారణంగా చోటుచేసుకొన్న మరణాలనే కరోనా మృతులుగా లెక్కిస్తామని చైనా మంగళవారం ప్రకటించింది.
జీనోమ్ సీక్వెన్సింగ్ వేగవంతం చేయాలి: కేంద్రం
చైనాతో పాటు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తద్వారా సకాలంలో కొత్త వేరియంట్లను గుర్తించవచ్చని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా వారంలో 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయిని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.