Nobel Prize | స్టాక్హోమ్: అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లౌడియా గోల్డిన్ ఆర్థిక రంగంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన గోల్డిన్ శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, స్త్రీ, పురుషుల మధ్య వేతనాల్లో అసమానత్వం, లింగ వివక్ష తదితర అంశాలపై చేసిన అధ్యయనానికి గానూ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు అందుకోనున్న మూడో మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నారు.
అమెరికాలో శ్రామిక రంగంలో మహిళల పాత్రకు సంబంధించిన సుమారు 200 ఏండ్ల డాటాను గోల్డిన్ విశ్లేషించారు. వేతన చెల్లింపుల్లో కాలక్రమేణా స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాలు ఎప్పుడు, ఎందుకు మారుతున్నాయో వివరించారు.
శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యంపై గోల్డిన్ సమగ్ర అధ్యయనం చేశారని కమిటీ ఫర్ ది ఫ్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ తెలిపింది. కమిటీ చైర్మన్ జాకబ్ స్వెన్సన్ ఆమె చేసిన విశేష కృషిని కొనియాడారు. ‘శ్రామిక రంగంలో మహిళల పాత్ర గురించి అర్థం చేసుకోవడం సమాజానికి ఎంతో అవసరం. ఈ అంశంపై విశేష అధ్యయనం చేసిన గోల్డిన్కు ధన్యవాదాలు. శ్రామిక రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన వచ్చింది’ అని జాకబ్ తెలిపారు.