America | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో వలస విధానంపై ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆందోళన అమెరికాకు వలస వెళ్లిన వారిలో నెలకొన్నది. ముఖ్యంగా తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కడంపై అనిశ్చితి నెలకొంటుందనే భయం వలస వెళ్లిన వారిలో మొదలైంది. అమెరికాలో జన్మించిన పిల్లలకు జన్మతా అక్కడి పౌరసత్వం లభిస్తుంది. దీనిని నాచురలైజ్డ్ సిటిజన్షిప్ అంటారు. అయితే, తాము గెలిస్తే మొదటి రోజే నాచురలైజ్డ్ సిటిజన్షిప్ను ఎత్తేస్తామని తమ ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారి ప్రచార పత్రాల్లోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘ఇక మీదట అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతా పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో ఒక్కరైనా కచ్చితంగా అమెరికా పౌరులై లేదా చట్టప్రకారం అమెరికా శాశ్వత నివాసితులై ఉండాలని ఆదేశాలు ఇస్తాం’ అంటూ ట్రంప్ ఎన్నికల ప్రచార పత్రంలో పేర్కొన్నారు. ప్రచారంలో చెప్పినట్టు ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే ఇక మీద అమెరికాకు వలస వెళ్లిన వారి పిల్లలకు జన్మతా పౌరసత్వం దక్కదు.
ట్రంప్ ప్రచార సారథికి కీలక పదవి
తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసీ వైల్స్ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నిర్ణయిస్తూ అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఆమె కీలక పాత్ర పోషించారు. అమెరికా చరిత్రలో తొలిసారి ఒక మహిళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కావడం విశేషం. కాగా, ట్రంప్ తన విజయ ప్రసంగంలో ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా ఆమె నిరాకరించారు. ఫ్లోరిడాకు చెందిన సూసీ చాలాకాలంగా రిపబ్లికన్ వ్యూహకర్తగా ఉన్నారు. 2016, 2020ల్లో రాష్ట్రంలో ట్రంప్ ప్రచార బాధ్యతలను చేపట్టారు. గతంలో ఆమె యుటా మాజీ గవర్నర్ జాన్ హంట్స్మన్ 2012 అధ్యక్ష ప్రచారానికి మేనేజర్గా పనిచేశారు.