లండన్, నవంబర్ 29: క్రిస్టియానిటీ అధికారిక మతంగా ఉన్న ఇంగ్లండ్లో క్రైస్తవుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నది. ఇంగ్లండ్లో ఏ మతానికి చెందని వారమని పేర్కొనే వారి సంఖ్య గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరుగగా.. దేశంలో క్రిస్టియన్ల సంఖ్య జనాభాలో 50 శాతం కంటే కిందకు పడిపోయింది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం జనగణన-2021 గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్లో 46.2 శాతం మంది తాము క్రిస్టియన్లు అని పేర్కొనగా.. దశాబ్దం క్రితం వీరి సంఖ్య 59.3 శాతంగా ఉండేది. ఇదే సమయంలో దేశంలో ముస్లిం జనాభా 4.9 నుంచి 6.5 శాతానికి, హిందువులు 1.5 నుంచి 1.7 శాతానికి పెరిగారు. ప్రతి ముగ్గురిలో ఒకరు అంటే దాదాపుగా 37 శాతం ప్రజలు తమకు ఏ మతం లేదని పేర్కొన్నారు. ఇది 2011 సమయంలో 25%గా మాత్రమే ఉండేది.