Chinese family : మనిషి ఎంతగా అభివృద్ధి చెంది, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా.. కొన్ని విశ్వాసాల్ని మాత్రం వదులుకోలేకపోతున్నాడు. అవి మంచివైనా.. చెడ్డవైనా.. కొన్నింటిని పాటిస్తూనే ఉంటారు. అలా, చైనాలో ఒక కుటుంబం పాటించిన ప్రాచీన సంప్రదాయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరణించిన తమ బంధువు మృతదేహంతోపాటు ఒక ఖరీదైన కారును కూడా ఒక కుటుంబం సమాధిలో పాతిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.
లియావోనింగ్ ప్రావిన్స్కు చెందిన, ధనవంతులైన జిన్ ఫ్యామిలీ.. ఇటీవల తమ బంధువు అంత్యక్రియలు నిర్వహించింది. దీనిలో భాగంగా మృతుడి సమాధి పక్కనే మరో పెద్ద సమాధి తవ్వి అందులో ఖరీదైన కారును పాతిపెట్టారు. దాదాపు రూ.1.5 కోటి విలువ గల మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును ఈ కుటుంబం సమాధి తవ్వి పాతిపెట్టింది. పైగా ఈ కారు నెంబరు 8888 కావడం విశేషం. చైనాలో ఈ నెంబర్ను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. అలాంటి ఖరీదైన కారును పెద్ద గొయ్యి తవ్వించి, అందులో ఉంచి పూడ్చేశారు. ఈ తతంగమంతా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఇది అక్కడి అధికారుల వరకూ వెళ్లింది. దీంతో వారు స్పందించి ఆ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కారును పూడ్చిపెట్టిన ఆ కుటుంబం స్పందించింది. తమ పూర్వీకుల సంప్రదాయం ప్రకారమే బంధువు మృతదేహంతోపాటు కారును కూడా పూడ్చినట్లు, దీనివల్ల అతడి ఆత్మ శాంతి కలుగుతుందని భావించినట్లు చెప్పారు.
A viral video from China’s Liaoning shows a black Mercedes-Benz S450L with a “8888” license plate being lowered into a pit by an excavator and buried next to a tombstone. Local civil affairs authorities in Liaoyang say they are investigating the incident. pic.twitter.com/4LUJwGOf7L
— Shanghai Daily (@shanghaidaily) April 10, 2026
అయితే, దీనిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చర్య అక్కడ అంధ విశ్వాసాలకు ప్రతీకగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, ఇలా చేయడం వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని అధికారులు అంటున్నారు. ఈ కారు తయారు చేసేందుకు బోలెడన్ని వనరులు ఖర్చయ్యాయని, పైగా దీన్ని భూమిలో పాతేయడం వల్ల కూడా హాని కలుగుతుందని అంటున్నారు. దీంతో కారును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అనంతరం ఆ కుటుంబానికి జరిమానా విధిస్తారు. పైగా కారు వెలికి తీసేందుకు అయ్యే ఖర్చుల్ని కూడా వారే భరించాలి. ఈ పనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మూఢ విశ్వాసాలతో, పర్యవరణానికి హాని చేయడం తగదని అంటున్నారు.