బీజింగ్: చైనాలో 30 ఏండ్లు దాటినా పెండ్లి కానివారి సంఖ్య పెరిగిపోతున్నదని తాజా సర్వే వెల్లడించింది. నగరాల్లోని యువత ఒంటరి బతుకును ఎంపిక చేసుకొంటుంటే, గ్రామీణ ప్రాంత యువత పెండ్లి మార్కెట్ నుంచి తొలగింపునకు గురయ్యాయరని చైనీస్ వెబ్సైట్ వీబో వెల్లడించింది. సర్వే ప్రకారం ఒంటరిగా బతకడం కూడా మంచిదేనన్న భావన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిదానంగా విస్తరిస్తున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏండ్లు దాటిన పురుషులు పెండ్లి ప్రయత్నాలు చేయడం లేదు. ఇదే సమయంలో మహిళలు పెండ్లి చేసుకోవాలనుకొంటున్నా వారికి సరైన జోడీ దొరకడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 నాటి పెండ్లి కాని పెద్దవారి సంఖ్య 40 కోట్లకు చేరింది. మరోవైపు చైనాలో విడాకుల రేటు పెరుగుతున్నది. ఉద్యోగం సాధించడం కష్టతరం కావడం, జీవన వ్యయం పెరగడం వల్ల ఒంటరిగా బతకాలని చాలామంది యువకులు భావిస్తున్నారు. మరోవైపు పెండ్లి చేసుకొన్న జంటలు పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపడం లేదు. విద్య ఖరీదైపోవడం, ఇంట్లో పెద్దలు, పిల్లలు ఉంటే బతుకు భారమవుతుందని భావించడమే ఇందుకు కారణం.