బీజింగ్ : ‘భారత్-చైనా మధ్య సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగితే, పది రోజుల్లో భారత్ ఓడిపోతుంది. స్వల్ప ప్రాణనష్టంతోనే డ్రాగన్.. అరుణాచల్, లఢక్ను ఆక్రమించుకోవచ్చు’.. రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే ప్రఖ్యాత ‘ఫోర్స్’ మ్యాగజీన్ ఎడిటర్ ప్రవీణ్ సావ్హెనీ తన తాజా పుస్తకం ‘ది లాస్ట్ వార్: హౌ ఏఐ విల్ షేప్ ఇండియాస్ ఫైనల్ షోడౌన్ విత్ చైనా’లో అభిప్రాయపడ్డారు. ‘కృత్రిమ మేధ (ఏఐ)’ సాంకేతికతతో నవ్య యుద్ధ రీతులను చైనా అవపోసన పడుతుండటమే భారత్పైడ్రాగన్ పైచేయి సాధించడానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం లో ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చైనా కంటే భారత్ 15 ఏండ్లు వెనుకబడినట్టు నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ ఐదు దశాబ్దాలకు ఒకసారి అగ్రదేశాలు యుద్ధ తంత్రాన్ని సమూలంగా మార్చుకుంటాయన్నది నిపుణుల మాట. రెండో ప్రపంచ యుద్ధానికి, గల్ఫ్ యుద్ధానికి మధ్య తేడాను విశ్లేషిస్తే ఈ విషయం సులభంగా అర్థమవుతుంది. 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత.. అమెరికా యుద్ధ తంత్రాల్లో వినూత్నత కనిపిస్తున్నది. గడిచిన ముప్పై ఏండ్లలో అగ్రరాజ్యం ఎన్నో అధునాతన సాంకేతికతలను యుద్ధ క్షేత్రాల్లో వినియోగించింది. అయితే, ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి చేరాలని ఉవ్విళ్లూరుతున్న చైనా.. పొరుగుదేశాల ఆక్రమణే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. అమెరికాను మించి టెక్నాలజీ వాడకానికి అడుగులు వేస్తున్నది. దీని కోసం సాంప్రదాయ యుద్ధ రీతులను విడిచిపెట్టి.. ‘ఏఐ వార్ (కృత్రిమ మేధ యుద్ధం)’ వైపునకు అడుగులు వేస్తున్నది.
ఏమిటీ ఏఐ వార్?
సాంప్రదాయక శతఘ్నులు, మ్యాన్యువల్ క్షిపణులు, మందుగుండు, యుద్ధ ట్యాంకులు, తుపాకులతో పాటు లక్షలాది మంది సైనికుల ప్రమేయం లేకుండా కృత్రిమ మేధ సాయంతో శత్రువును బలహీనపర్చే యుద్ధమే ‘ఏఐ వార్’.
ఎలా పనిచేస్తుంది?
ఇన్ఫర్మేషనైజ్డ్ (సమాచారీకరణ), ఇంటెలిజెంటైజ్డ్ (తెలివితో కూడిన) అనే రెండు స్ట్రీమ్లు ప్రాతిపదికగా ఏఐ వార్ కొనసాగుతుంది.
ఏ స్ట్రీమ్ ఏం చేస్తుంది?
ఇన్ఫర్మేషనైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్-శత్రు దేశం స్థావరాలు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహాల సమాచారాన్ని సేకరిస్తుంది. ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్-శత్రుదేశంపై సాంకేతికత దాడి ఎలా చేయాలో, ఏఏ వెపన్స్ను వినియోగించాలో చూస్తుంది.
వ్యూహాలు ఎలా ఉంటాయి?
సాంప్రదాయ యుద్ధంలో భూ, సముద్ర, గగనతల మార్గాలపైనే ప్రధానంగా దృష్టిసారిస్తారు. అందుకే ఇప్పటివరకూ అన్ని దేశాలూ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాలను భద్రత కోసం వినియోగిస్తున్నాయి. అయితే ‘ఏఐ వార్’లో ఇన్ఫర్మేషనైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ కింద.. సైబర్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్, స్పేస్.. అలాగే, ఇంటెలిజెంటైజ్డ్ వార్ఫేర్ స్ట్రీమ్ కింద స్వయంచాలిత ఆయుధాలు, రోబోటిక్ సోల్జర్స్, ఇంటర్నెట్ ఆఫ్ మిలిటరీ థింగ్స్ వాటిని రంగంలోకి దింపుతారు. అంటే, యుద్ధ క్షేత్రంలో సైనికులకు బదులు రోబోలు, ఆటోమేటిక్ యంత్రాలు ప్రత్యర్థులతో తలపడుతాయి. వీటిని క్లౌడ్, బిగ్ డాటా, ఇంటెలీజెంట్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ కోడ్స్ ఆపరేట్ చేస్తాయి.
‘ఏఐ వార్’ టెక్నాలజీ భారత్కు ఎప్పుడు?
మరో 10-15 ఏండ్లలో చైనా ఏఐ వార్ సాంకేతికతను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ ఈ సాంకేతికతపై ఇప్పటికిప్పుడు దృష్టి సారించినప్పటికీ, దీన్ని అందిపుచ్చుకోవాలంటే మరో 30 ఏండ్లు పట్టొచ్చని అంటున్నారు.