China | కరోనా మహమ్మారి అనంతరం మూడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా తన సరిహద్దులను విదేశీ పర్యాటకుల కోసం తెరవనున్నది. ఇందు కోసం బుధవారం నుంచి అన్నిరకాల వీసాలను జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో సరిహద్దులో మూసివేయడంతో ఆ దేశ వృద్ధి తగ్గింది. అలాగే పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పర్యాటకరంగాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు నిర్ణయించి.. ఈ మేరకు వీసాల జారీకి అనుమతులు జారీ చేయనున్నట్లు తెలిపింది.
వీసాలు అవసరం ఉన్న వారితో పాటు హాంకాంగ్, మకావు, హైనన్ ఐల్యాండ్ నుంచి వీసా అవసరం లేని టూరిస్టులను సైతం బుధవారం నుంచి అనుమతి ఇవ్వనున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది. అలాగే గ్వాంగ్డాంగ్లో పర్యటించేందుకు విదేశీ టూరిస్టులకు సైతం ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపింది. 2020 మార్చి 28కు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు చెల్లుబాటు అవుతాయని చెప్పింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ ప్రయాణికులు తాకిడి పెరగడం ద్వారా హైఎండ్ హోటల్ హోటల్స్కు వరంలా మారుతుందని చైనీస్ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఏప్రిల్లో షాంఘై ఆటో పునః ప్రారంభంకానున్నాయి.
అలాగే గతేడాది వాయిదా పడిన ఆసియా క్రీడలు సెప్టెంబర్లో తూర్పు నగరమైన హాంగ్జౌలో జరుగనున్నాయి. అయితే, వీసాలు జారీ చేయనున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, కొవిడ్ పాజిటివ్, నెగెటివ్ సర్టిఫికెట్లు అవసరమా? లేదా? అనేది విషయంపై మాత్రం డ్రాగన్ దేశం స్పష్టత ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో కఠినంగా జీవో కోవిడ్ను పాలసీని చైనా అమలు చేసింది. దీనిపై ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది. ఆ తర్వాత కొవిడ్ కేసులు చైనాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇటీవల కేసులు తగ్గాయని ప్రకటించింది. ఈ క్రమంలోనే నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టేందుకు సరిహద్దులను తెరవబోతున్నది. కొవిడ్కు ముందు చైనాను 97.7 మిలియన్ల మంది సందర్శించగా.. 2022లో కేవలం 4.5 మిలియన్ల మంది మాత్రమే పర్యటించారు.