బీజింగ్, ఆగస్టు 28: చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ దేశ భూభాగాలుగా చైనా ప్రకటించింది. దీనికి సంబంధించి సోమవారం అధికారిక మ్యాపుల్ని విడుదల చేసింది. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్ ఆఫ్ ద స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా’ పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది. డిజిటల్, నావిగేషన్ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ మీడియా పేర్కొన్నది. దేశ సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ ఈ మ్యాపుల్ని తయారుచేయగా, దీంట్లో భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ దేశ భూభాగాలుగా చూపుకుంది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంతా తమదేనని గతంలో విడుదల చేసిన ఎడిషన్లో ప్రకటించింది.
తాజా ఎడిషన్లో అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రదేశాల పేర్లను ప్రామాణీకరణ చేస్తూ మ్యాపును రూపొందించటం గమనార్హం. పేర్లను మార్చుతూ అరుణాచల్పై చైనా ఈవిధంగా మ్యాపులు విడుదల చేయటం ఇది మూడోసారి. మరికొద్ది రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపై పరిశీలకులు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది దేశ సరిహద్దుల నిర్వహణ కోసం అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రత్యేకంగా సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.