బీజింగ్: పొరుగు దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల ఆక్రమణలకు చైనా పాల్పడుతున్నది. తాజాగా భూటాన్లో కొత్త నిర్మాణాలు చేపడుతున్నది. భూటాన్ పరిధిలోని రెండు గ్రామాలను కలుపుతూ భారీ స్థాయిలో 166 భవనాలు, రోడ్లు అక్రమంగా నిర్మిస్తున్నది. డోక్లామ్ పీఠభూమికి 30 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఇవి ఉన్నాయి. అధిక రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు దీనిని నిర్ధారిస్తున్నాయి.
2017లో చైనీస్ రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను భారత సైనికులు భౌతికంగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో భారత స్థానాలను వీడిన చైనా, డోక్లామ్కు కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అక్షం నుంచి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను పునఃప్రారంభింది. 2020 నవంబర్లో గుర్తించిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఇది స్పష్టమవుతున్నది. భూటాన్ పరిధిలోని సరిహద్దు ప్రాంతంలో ఒక పూర్తి స్థాయి గ్రామాన్ని చైనా అక్రమంగా నిర్మించింది. ఒక చోట ఏకంగా 34 భవనాలున్నాయి.
ఇంటెల్ ల్యాబ్లోని ప్రముఖ జియోఇంట్ పరిశోధకుడు డామియన్ సైమన్ ప్రకారం, గత ఏడాది నవంబర్లో కొత్త నిర్మాణ ప్రాంతాలను మొదటిసారిగా గుర్తించారు. చైనా, భూటాన్ల మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణాలు, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. ఇందులో చాలా వరకు నిర్మాణ దశలోనే ఉన్నాయి.
మరోవైపు అక్రమ నిర్మాణాల కోసం వినియోగిస్తున్న భారీ మెషినరీ, తవ్వే సామగ్రిని కూడా ఆ ప్రాంతంలో గుర్తించారు. అయితే చైనా బలగాల కోసమే వీటిని నిర్మిస్తున్నారా లేదా ఆ దేశ పౌరుల కోసమా అన్నది స్పష్టం కాలేదు. మరోవైపు రెండు విధాలా ఈ అక్రమ కట్టడాలను చైనా వినియోగించుకునే అవకాశమున్నదని నిర్మాణాల తీరు ద్వారా తెలుస్తున్నది.