America | చైనాకు చెందిన కంపెనీలపై అగ్రరాజ్యం చర్యలు తీసుకుంది. రహస్యంగా పాక్కు బాలిస్టిక్ క్షిపణి పరికరాలను సరఫరా చేస్తున్నందుకు మూడు డ్రాగన్ కంపెనీలను నిషేధించింది. అంతర్జాతీయ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక, నిరాయుధీకరణ పాలసీ కింద ఈ ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC)కి చెందిన మూడు కంపెనీలు పాక్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించిన వస్తువులను సరఫరా చేశాయని విదేశాంగశాఖ పేర్కొంది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
డ్రాగన్ దేశం వక్రబుద్ధితో పాక్ సైనిక ఆధునికీకరణలో భాగంగా ఆయుధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్నది. అయితే, మూడు కంపెనీల్లో జనరల్ టెక్నాలజీ లిమిటెడ్, జీబింగ్ లువో లువో టెక్నాలజీ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, చాంగ్ జౌ యుటెక్ కంపోజిట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి.
జనరల్ టెక్నాలజీ లిమిటెడ్ బాలిస్టిక్ క్షిపణి రాకెట్ ఇంజిన్లో ఉపయోగించే బ్రేజింగ్ మెటీరియల్ను.. లువో లువో టెక్నాలజీ డెవలప్మెంట్ మాండ్రెల్స్, ఇతర యంత్రాలను.. చాంగ్జౌ కంపెనీ D-గ్లాస్ ఫైబర్, క్వార్ట్జ్ ఫాబ్రిక్, హై సిలికా ఫాబ్రిక్ సరఫరాను చేశాయి. ఆయా కంపెనీలు సరఫరా చేసినవన్నీ క్షిపణి వ్యవస్థలు ఉపయోగిస్తుంటారు.