బీజింగ్: విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు సమీపంలో ఉన్న వుడ్సైడ్లో జరిగిన ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) శిఖరాగ్ర సమావేశంలో భాగంగా యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్తో (Joe Biden) భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ రిపబ్లిక్ స్థాపించినప్పటి నుంచి లేదా అంతము ముందు నుంచి చైనా యుద్ధాన్ని ప్రేరేపించలేదని, ఒక్క అంగుళం విదేశీ భూమిని ఆక్రమించలేదన్నారు.
కాగా, యూఎస్-చైనా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగదెంపులు చేసుకునేంత పరిస్థితి లేదని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే జిన్జియాంగ్, టిబెట్, హాంకాంగ్లలో చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు (Human rights) పాల్పడుతున్న విషయంపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020లో లడఖ్లోని (Ladakh) గల్వాన్లోయలో డ్రాగన్ సైనికులు భారత్లోకి చొచ్చుకొచ్చారు. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద సరిహద్దులను చెరపివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. అదేవిధంగా అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకున్నది. ఇక లడఖ్లోని కొంత భాగం చైనా దురాక్రమణలో ఉన్న విషయం తెలిసిందే. ఇక సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతుండటంతో వాస్తావాధీన రేఖ వెంబడి (LAC) సుమారు 50 వేలకు పైగా సైనికులను భారత్ మోహరించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అత్యాధునిక ఆయుధాలను సరిహద్దుల్లో సిద్ధంగా ఉంచింది.