ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. కొన్నిరోజుల క్రితమే దీని గురించి ఆయన హింట్ ఇచ్చారు.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనాకు చెందిన బ్యాంకుల కన్సార్షియం తమ దేశానికి సుమారు 2.3 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని, మరికొన్ని రోజుల్లో ఈ సొమ్ము పాక్ ఖాతాలకు చేరుతుందని ఇస్మాయిల్ ఇదివరకే ట్వీట్ చేశారు.
తాజాగా ఈ సొమ్ము స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్బీపీ) ఖాతాకు చేరినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగాయని తెలిపారు. కొన్నిరోజులుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న పాక్.. శ్రీలంక బాటలోనే నడిచేలా కనిపించింది.
చివరకు ప్రజలు తాగే టీ కూడా రోజుకు రెండు, మూడు కప్పులే తాగాలని ఆ దేశ మంత్రులు సూచనలు ఇచ్చే స్థాయికి ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇలాంటి సమయంలో చైనా నుంచి ఆర్థిక సహాయం లభించడంతో ఆ దేశం కొంత తేరుకున్నట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.