చైనాలో సంతానంపై ఆంక్షల సడలింపు
జనాభా రేటు తగ్గడంతో నిర్ణయం
బీజింగ్, మే 31: గడిచిన నాలుగు దశాబ్దాల్లో ‘ఒకే బిడ్డ’ విధానంతో జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో చైనా కీలక నిర్ణయం తీసుకొన్నది. చైనా పౌరులు ఇక నుంచి ముగ్గురు పిల్లలను కూడా కనడానికి అనుమతించింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఇటీవలి జనాభా లెక్కల్లో చైనాలో జననాల రేటు బాగా తగ్గిపోయినట్టు తేలింది. ఈ లెక్కల ప్రకారం చైనాలో గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 0.53శాతంగా నమోదైంది. 2010 జనాభా లెక్కలతో పోల్చితే చైనాలో 16-59 ఏండ్ల వయసున్న జనాభా 4 కోట్లు తగ్గింది. చైనాలో ఒకే బిడ్డ విధానం 1979 నుంచి అమల్లో ఉన్నది. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకొన్నారు. దీని వల్ల తొలుత ఫలితాలు కనిపించినా క్రమంగా వర్కింగ్ పాపులేషన్ (పనిచేయగల వయస్సు ఉన్న జనాభా) తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగింది. కార్మికుల కొరత ఏర్పడింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. దీంతో 2016లో దీనిని సడలిస్తూ ఇద్దరు పిల్లలను కనడానికి వీలు కల్పించారు. తాజాగా ఈ సంఖ్యను ముగ్గురికి పెంచారు. చైనా ప్రస్తుత జనాభా 141.2 కోట్లు. ప్రస్తుత చైనా జనాభా పెరుగుదల రేటును బట్టిచూస్తే 2027కలా ్లభారత్ చైనాను దాటి అత్యధిక జనాభాగల దేశంగా అవతరిస్తుందని అంచనా.
నిబంధనలు సడలించినా పెరగని జననాలు
2016లో ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఈ ఐదేండ్లలో చైనాలో పెద్దగా జననాలు నమోదు కాలేదు. 2020లో చైనాలో 1.2 కోట్ల మంది మాత్రమే జన్మించారు. అదనంగా మరొకరిని కని పెంచడం ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమని వారి భావన. అందుకే పెకింగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లియాంగ్ జియాన్జంగ్ ఆసక్తికర సూచన చేశారు. చైనాలో మళ్లీ జననాల రేటు పెరగాలంటే ప్రభుత్వం కొత్తగా పుట్టిన ఒక్కో బిడ్డకు కోటి రూపాయలకు పైగా(10 లక్షల యువాన్లు) ఇవ్వాలని పేర్కొన్నారు.