బీజింగ్: ఒమిక్రాన్ బీఎఫ్.7 కరోనా వేరియంట్ చైనాలో అల్లకల్లోలం రేపుతున్నది. ఈ వారంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో 3.7 కోట్ల మంది ప్రజలు కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది జనవరిలో ఒకే రోజున కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన 4 కోట్ల సంఖ్య కంటే కూడా ప్రస్తుత సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని చైనా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని బీజింగ్తోపాటు సిచువాన్ ప్రావిన్స్లో సగానికి పైగా నివాసితులు కరోనా బారినపడినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న చైనాలోని 18 శాతం జనాభాకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్హెచ్సీ) అంతర్గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. ఈ నెల 20న 3.7 కోట్ల కరోనా కేసులు అంచనా వేయగా అధికారికంగా మాత్రం 3,049 కేసులనే పేర్కొన్నారని వెల్లడించింది. అయితే కరోనా వల్ల చైనాలో రోజుకు ఎంత మంది మరణిస్తున్నారో అన్న అంచనాలు ఆ మినిట్స్లో లేవని ఒక రిపోర్ట్లో పేర్కొంది.
కాగా, ఇప్పటి వరకు చైనా పాటించిన జీరో కోవిడ్ విధానంపై ఆ దేశ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన అధికారులు ఈ విధానంలో మార్పు చేశారు. అలాగే కరోనా ఆంక్షలను సడలించారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకోని ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్తోపాటు పలు ప్రావిన్స్లలో కరోనా కేసుల నమోదు తీవ్రస్థాయికి చేరింది. అలాగే మహా నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటం చైనా అధికారులను కలవరపరుస్తున్నది.