China | బీజింగ్, ఏప్రిల్ 1: అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంటూ చైనా తన స్వరం పెంచుతున్నది. తాజాగా అక్కడ 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెడుతూ నాలుగో జాబితాను ఆదివారం విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక వెబ్సైట్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రాంతాల పేర్లు విదేశీ భాషలో ఉండటం చైనా ప్రాదేశికతకు హాని కలిగించవచ్చు. చైనా సార్వభౌమత్వ హక్కులను నేరుగా ప్రస్తావించకూడదు, అధికారం లేకుండా అనువాదం చేయకూడదు’ అని ఆ ప్రకటన తెలిపింది.
భారత ప్రధాని మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో సైనికులను వేగంగా తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగాన్ని జాతికి అంకితం చేసిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన విడుదల చేసింది. చైనా నాలుగో జాబితాను భారత్ ఖండించింది. అరుణాచల్ తమ దేశ అంతర్భాగమని.. పేర్లను మార్చడం ద్వారా వాస్తవాలను మరుగు పరచలేరని స్పష్టం చేసింది.