నిజామాబాద్, జూన్ 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గ్రామాలు, పట్టణాల రూపు రేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. జూలై ఒకటి నుంచి పది రోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, మేయర్ నీతుకిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సోమవారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి వేముల ముఖ్య అతిథిగా హాజరై పల్లె, పట్టణ ప్రగతి ప్రాధాన్యతపై ప్రసగించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతోపాటు ప్రజల భాగస్వామ్యంతో పల్లె, పట్టణ ప్రగతిని ఎలా విజయవంతం చేయాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారు. హరితహారం కార్యక్రమాన్ని సైతం సక్సెస్ చేయాలని మంత్రి కోరారు. అటవీ శాఖ అధికారులు బాధ్యతతో పని చేసి అటవీ సంపద వృద్ధికి పాటుపడాలన్నారు.
దేశానికి తెలంగాణ రోల్ మోడల్..
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించడానికి, హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని అందించడానికి, డంపింగ్ యార్డులకు చెత్తను తరలించడానికి రాష్ట్రంలో 12,670 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు సమకూర్చినట్లు మంత్రి వెల్లడించారు. ఇలా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు. ప్రతి గ్రామంలో మనిషి చనిపోతే గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఊరూరా వైకుంఠధామాలు నిర్మించినట్లు చెప్పారు. 2014కు ముందు ఉపాధి హామీ పథకంలో జిల్లాలో కేవలం మెటీరియల్ కోసం రూ.100 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేదన్నరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, హరితహారంలో కంచెల ఏర్పాటు, నీరు పట్టడం తదితర వాటిని కూడా ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వహించుకునేలా చేసిందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నిబద్ధతతో పని చేయడంతో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోనే రూ.220 కోట్ల కూలితో పాటు రూ.140 కోట్లతో మెటీరియల్ కింద ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా అభివృద్ధితోపాటు పేదలకు ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ఉపయోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచిందన్నారు.
అటవీ విస్తీర్ణం పెంచుకోవాలి..
ఆరు దఫాలుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ద్వారా కోట్ల మొక్కలను నాటడంతో అటవీ విస్తీర్ణం 3.8 శాతం పెంచుకోవడానికి వీలు కలిగిందని మంత్రి వేముల అన్నారు. అడవుల రీ జనరేషన్ కోసం అటవీ అధికారులు మరింత పక్కాగా పనిచేయాలని సూచించారు. హరితహారంలాంటి మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి మొదలు కాబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను 10 రోజుల పాటు ఒక యజ్ఞం మాదిరిగా భావించి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలను, పట్టణాలను సుందరంగా, పచ్చగా తీర్చిదిద్ది జిల్లాను ముందు వరుసలో నిలపాలన్నారు.
గ్రామాలు, పట్టణాలకు ఆర్ధిక దన్ను..
మూడు దఫాలుగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమయ్యాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలంతా భాగస్వామ్యమై కేసీఆర్ పిలుపుతో గ్రామాలు, పట్టణాలను బాగు చేసుకున్నారని చెప్పారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఆశతో ఒక ఆచరణ యోగ్యమైన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. ప్రజా అవసరాలను గుర్తించి కార్యక్రమాలను అమలుచేసేందుకు పరిపూర్ణమైన కార్యాచరణను కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. గతంలో మాదిరి ప్రచారానికి, నినాదాలకు పరిమితం చేయకుండా అవసరమైన అన్ని హంగులు, నిధులు సమకూర్చి ఒక పకడ్బందీ ప్రణాళికతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు జవాబుదారీతనం, బాధ్యతతో టీం వర్క్గా పనిచేయడంతో గతంలో మంచి ఫలితాలు చూశామని చెప్పారు.దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లు, పట్టణాలు, నగరాలకు రూ.148 కోట్లు ప్రతి నెలా విడుదల చేస్తున్నామని మంత్రి వివరించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.250 కోట్లు పోగా మిగతావన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందోన్నారు.