లండన్: బ్రిటన్లో (Britain) కరోనా మహమ్మారి జూలు విదిల్చింది. రోజువారీ కేసులు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. దేశంలో ఒకేరోజు రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి బ్రిటన్లో ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. యునైటెడ్ కింగ్డమ్లో మంగళవారం 2,18,724 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 48 మంది మరణించడటంతో మొత్తం మృతులు 1,48,941కి పెరిగారు. అదేవిధంగా 14,126 మంది బాధితులు ఇంకా దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
దేశంలో ఇప్పటివరకు 12 ఏండ్ల వయస్సు పైబడినవారిలో 90 శాతానికిపైగా మంది కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. అదేవిధంగా సుమారు 82 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారు. కాగా, భారీగా రోజువారీ కేసులు నమోదవుతున్నప్పటికీ దేశంలో ఇప్పటికిప్పుడే ఆంక్షలు విధించే ఉద్దేశమేదీ లేదని బ్రిటిష్ హెల్త్ సెక్రెటరీ వెల్లడించారు. అమెరికా లాగా హోం క్వారంటైన్ను ఏడు నుంచి ఐదు రోజులకు తగ్గించే ప్రణాళికలేమీ లేవన్నారు.