లండన్: న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఇటీవల ఐటీ సర్వే జరిగిన నేపథ్యంలో ఆ వార్తా సంస్థను బ్రిటన్ ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మీడియా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని, బీబీసీకి అండగా నిలిచి నిధులు అందజేస్తామని స్పష్టం చేసింది.
బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్)లో మంగళవారం ఓ అత్యవసర ప్రశ్నకు ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ జూనియర్ మినిస్టర్ డేవిడ్ రుట్లే సమాధానమిస్తూ.. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలకు సంబంధించిన ఆరోపణలపై తామేమీ వ్యాఖ్యలు చేయలేమని, కానీ పటిష్ఠమైన ప్రజాస్వామ్య వ్యవస్థలకు పత్రికా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో కీలకమని తెలిపారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ అందిస్తున్న సేవలను చాలా ముఖ్యమైనవిగా తాము భావిస్తున్నామన్నారు.