మొదటి భాగం: 2002 గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ డాక్యుమెంటరీలో పేర్కొన్నది. దీనికి సంబంధించి అప్పట్లో ఘటనతో సంబంధమున్న పలువురిని ఇంటర్వ్యూ చేసింది. గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న మోదీ.. ఆ ఘటనను రాజకీయాలకు ఎలా వినియోగించుకొన్నారో విశ్లేషించింది. చివర్లో ప్రధాని మోదీని కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.
రెండో భాగం: ‘మోదీ ఓ విచ్ఛిన్న శక్తి. ఆయన వచ్చాకే మూక దాడులు పెరిగాయి. మోదీ చెబుతున్న ‘నవ భారత్’ అనే పదం.. విభేదాలు, మతపరమైన ఆందోళనలకు నెలవై ఉన్నది. పౌరసత్వానికి మతాన్ని జోడించారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఈ సందర్భంగా జరిగిన మత కల్లోలాల్లో 53 మంది మరణించారు. ఢిల్లీ అల్లర్లలో మరణించిన వారిలో మూడింట రెండొంతులు ముస్లింలేనం’టూ బీబీసీ డాక్యుమెంటరీ రెండో ఎపిసోడ్లో విశ్లేషించింది.
బీబీసీ డాక్యుమెంటరీపై బ్రిటన్, యూఎస్ స్పందన
బ్రిటన్: బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీని బ్రిటన్ సమర్థించింది. భావ వ్యక్తీకరణలో బీబీసీ పూర్తి స్వతంత్రత కలిగిన మీడియా సంస్థ అని వ్యాఖ్యానించింది. ఈ డాక్యుమెంటరీ కారణంగా భారత్-బ్రిటన్ మధ్య ఉన్న మైత్రిపై ఎలాంటి ప్రభావం పడబోదని విదేశాంగశాఖ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ తెలిపారు.
అమెరికా: బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్తో పాటు ప్రపంచంలో ఏ దేశంలో అయినా భావప్రకటన స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు.