G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. దీంతో రాజధాని ప్రాంతం మొత్తం భద్రత వలయంలోకి వెళ్లిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల ప్రధానులు, ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అతిథుల కోసం ప్రత్యేకంగా బస ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బైడెన్ సహా ఎవరెవరు ఏఏ ప్రాంతంలో బస చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)..
జీ20 సమ్మిట్లో భాగంగా బైడెన్ నాలుగురోజులపాటు భారత్లో పర్యటించబోతున్నారు. హోటల్ ఐటీసీ మౌర్య ( ITC Maurya)లో బైడెన్కు వసతి కల్పించారు. తన పర్యటనలో భాగంగా బైడెన్ ఈనెల 7వ తేదీనే ఢిల్లీకి బయలుదేరుతారు. సమావేశాలకు ఒకరోజు ముందు అంటే 8వ తేదీన ఇండియాలో ల్యాండ్ అవుతారు. ఇక అదేరోజు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత శని, ఆదివారాల్లో జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సమస్యలు, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై ప్రపంచ దేశాల నేతలతో చర్చించనున్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారత్కి రావడం ఇదే తొలిసారి.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak): భారతీయ మూలాలు కలిగిన రిషి సునాక్ ప్రధాని హోదాలో తొలిసారి ఇండియాకు వస్తున్నారు. 43 ఏళ్ల రిషి షాంగ్రి లా హోటల్ (Shangri La hotel.)లో బస చేయనున్నారు.
జస్టిన్ ట్రూడోస్ (Justin Trudeau) : కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోస్ ప్రస్తుతం ఇండొనేషియా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఏసియన్ సమ్మిట్ లో ఆయన పాల్గొంటున్నారు. అక్కడి నుంచి ట్రూడో నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. ది లలిత్ హోటల్ (The Lalit Hotel)లో ఆయన స్టే చేస్తారు.
ఆంథోనీ ఆల్బనీస్ (Anthony Albanese): ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మూడు దేశాల్లో పర్యటించబోతున్నారు. అందులో ముందుగా ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ సందర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. ఇక్కడ 9-10 తేదీల్లో జరగబోయే జీ20 సమ్మిట్లో పాల్గొంటారు. ఇక ఆంథోనీ.. ఇంపీరియల్ హోటల్ (Imperial Hotel)లో బస చేయనున్నారు.
చైనా బృందం (China delegation): ఇక ఈ సమ్మిట్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. జీ20 సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి ఈ సమ్మిట్ కు చైనా అధ్యక్షుడు గైర్హాజరు కానుండటం ఇదే తొలిసారి. ఢిల్లీలో జరగబోయే ఈ సమ్మిట్కు అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రధాని లి కియాంగ్ నేతృత్వంలో చైనా బృందం సమావేశాలకు హాజరుకానుంది. వీరందరికీ తాజ్ హోటల్ (Taj Hotel)లో వసతి ఏర్పాట్లు చేశారు.
Also Read..
Russia – Ukraine | ఉక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. 17 మంది మృతి