వాషింగ్టన్ : ఇప్పటికే రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అనుమతి ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మరో నిర్ణయంతో ఉద్రిక్త పరిస్థితులకు మరింత ఆజ్యం పోశారు. ఉక్రెయిన్కు తొలిసారిగా యాంటీ పర్సనల్ మైన్లను పంపడానికి బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది బైడెన్ పాలనలో మరో ప్రధాన విధాన, సంచలన నిర్ణయంగా భావిస్తున్నారు. ఉక్రెయిన్ రక్షణాత్మక ప్రాంతాలలో రష్యా దళాలు నెమ్మదిగా, నిదానంగా వస్తుండటంతో ఈ యాంటీ పర్సనల్ మైన్లను కీవ్ తమ దేశంలోని తూర్పు ప్రాంతంలో వినియోగించనుంది. యాంటీ పర్సనల్ మైన్లు లేదా యాంటీ పర్సనల్ లాండ్ మైన్లు (ఏపీఎల్)గా వ్యవహరించే వీటితో భారీగా సైనికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అయితే ఈ యాంటీ పర్సనల్ మైన్లను తమ దేశ రక్షణకు తమ దేశ భూభాగంలోనే మాత్రమే వినియోగించాలని, వీటిని శత్రుదేశాలపై దాడికి ప్రయోగించరాదని బైడెన్ ప్రభుత్వం పేర్కొంది.
అలాగే వీటి ద్వారా పౌరులకు జరిగే ప్రమాదాన్ని తక్కువకే పరిమితం చేస్తామని ఉక్రెయిన్ నుంచి హామీ పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే విచక్షణా రహితంగా ప్రాణనష్టం కలిగించే యాంటీ పర్సనల్ మైన్స్ వినియోగాన్ని మానవ హక్కుల సంఘాలు చాన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి. భూతల యుద్ధంలో ఇటీవల మాస్కో తీవ్రంగా నష్టపోతున్నది. ఈ వారంలో మాస్కో అత్యధిక సంఖ్యలో తన సైనిక బలగాలను కోల్పోయినట్టు వార్తలొస్తున్నాయి. అయితే మిత్రదేశమైన ఉత్తర కొరియా నుంచి దానికి సైనిక బలగాలతో పాటు, ఆయుధ సంపత్తి కూడా సమకూరుతుండటంతో ఉత్సాహాన్ని పుంజుకుంటున్నది. గత కొన్ని నెలలుగా కీవ్ చేస్తున్న విజ్ఞప్తుల మేరకు రష్యాపై దీర్ఘశ్రేణి అమెరికా క్షిపణులను ప్రయోగించడానికి ఇటీవల బైడెన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇప్పటికే అంతర్జాతీయంగా వివాదంగా మారింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. కీవ్పై రష్యా వైమానిక దళాలు దాడి చేయవచ్చునన్న హెచ్చరికలతో అక్కడ ఉన్న తమ దౌత్య కార్యాలయాన్ని బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు.