జెనీవా : భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవిడ్ టీకాపై సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ పేర్కొన్నారు. యూఎన్ బ్రీఫింగ్లో ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. కమిటీ సంతృప్తి చెందితే రాబోయే 24 గంటల్లోపు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. టీకా సురక్షితమైందని, ప్రభావవంతమైందని నిర్ధారించుకోవడానికి.. క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేయాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) కోసం ఏప్రిల్ 19న ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పలుసార్లు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) కోసం భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు పూర్తి స్థాయిలో సమర్పించింది. కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ ఐసీఎంఆర్తో కలిసి అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద టీకాను వినియోగిస్తున్నారు. టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు, పలువురు భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈయూఎల్ గుర్తింపు వస్తే భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణం సులభతరం కానున్నది.