Bangladesh : భవిష్యత్తులో భారత్ (India) తో సంబంధాలు కొనసాగడం గంగానది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందని బంగ్లాదేశ్ (Bangladesh) అధికార పార్టీ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం కోసం చర్చలు జరపాలని భారత్ను డిమాండ్ చేసింది. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండో-బంగ్లాదేశ్ (India-Bangladesh) గంగానది నీటి ఒప్పందం 1996లో జరిగింది. అప్పటి ప్రధాని షేక్ హసీనా హయాంలో కుదిరిన ఈ డీల్ ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుంది. కొత్త ఒప్పందం కుదిరేవరకు పాత ఏర్పాట్లే కొనసాగాలని బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో జరిగే నీటి ఒప్పందాలకు కాలపరిమితి ఉండవద్దని ఆలంగీర్ షరతు విధించారు. కాగా, గంగానదిని బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు. అక్కడి వ్యవసాయం, పర్యావరణం, తాగునీటి వ్యవస్థలకు ఈ నది ఎంతో కీలకం. బంగ్లాదేశ్లోని మూడో వంతు జనాభా జీవనోపాధి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. ఫరక్కా బ్యారేజ్ వల్ల తమకు ఎండాకాలంలో నీటి ప్రవాహం తగ్గిపోతోందని బంగ్లాదేశ్ అంటోంది. దీనివల్ల నదుల్లో ఉప్పునీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయని వాదిస్తోంది. మరోవైపు కోల్కతా పోర్టు రక్షణ కోసమే ఫరక్కా బ్యారేజ్ నిర్మించినట్లు భారత్ మొదటి నుంచి చెబుతోంది.
ఈ ఇబ్బందులను అధిగమించే పేరిట బంగ్లాదేశ్ పద్మా నదిపై ఒక మెగా బ్యారేజ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇది 2033 నాటికి పూర్తి చేయాలని ప్రధాని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ బ్యారేజ్ నిర్మాణంపై భారత్తో సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ ఏకపక్షంగా నిర్ణయించింది.