గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
ఒక్కరోజే 42 మంది మృతి.. బాధితుల్లో పిల్లలు
రంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
గాజా సిటీ (గాజా స్ట్రిప్), మే 16: ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య వారం క్రితం మొదలైన ఘర్షణలు ఆదివారం తీవ్రరూపం దాల్చాయి. గాజా సిటీపై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడటంతో మూడు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో కనీసం 42 మంది మరణించారు. ఇందులో 12 మంది మహిళలు, 8 మంది పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 50 మంది గాయపడ్డారని తెలిపింది. ఉగ్రవాద సంస్థ హమాస్ టాప్ లీడర్లలో ఒకరైన యహియేహ్ సిన్వార్ నివాసాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. దాడి జరిగిన సమయంలో అతను ఇంట్లో లేడని వివరించింది. జెరూసలేంలోని ఆల్-ఆక్సా మసీదు వద్ద గతవారం స్థానికులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారితీసింది. దీంతో పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్పై వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ కనీసం 188 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 55 మంది పిల్లలు, 33 మంది మహిళలు ఉన్నారు. మరో 1,230 మంది గాయపడ్డారు. ఇటువైపు 8 మంది ఇజ్రాలెయన్లు మృత్యువాతపడ్డారు. ఇందులో ఐదేండ్ల బాలుడు, సైనికుడు కూడా ఉన్నారు.
దాడులు ఆపేయండి
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం ముదురుతుండటం, దాడుల్లో అమాయక ప్రజలు మరణిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పాలస్తీనాపై దాడులను వెంటనే నిలిపివేయాలని 57 ముస్లిం దేశాల సమాఖ్య ఇజ్రాయెల్ను డిమాండ్ చేసింది. ఈ దాడులతో అమాయకులైన ముస్లిం ప్రజలు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, గొడవ సద్దుమణిగేలా మధ్యవర్తిత్వం చేయాలన్న ఈజిప్టు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంకోవైపు, ఈ అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఇంకోవైపు, శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని ప్రముఖ మీడియా భవనాలు ధ్వంసమవడంపై అమెరికా స్పందించింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసింది.