గతైర్మాణిక్యత్వం గగన మణిభిస్సాంద్ర ఘటితం
కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతియః
స నీడే యఛ్ఛాయాఛ్ఛురణ శబలం చంద్రశకలం
ధను శ్శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం॥
ధ్యానంలో అమ్మవారి కిరీటాన్ని చూస్తున్న సాధకునికి ఆ వర్ణాలు ఇంద్రధనస్సులాగా కనిపిస్తున్నాయట. ఎవరైతే అమ్మ కిరీటాన్ని ధ్యానిస్తారో వారు ఆ చిత్రవర్ణాలను ఇంద్రధనస్సులుగానే బావిస్తారని (భ్రమిస్తారని) శంకరుల భావన. ఒక సూర్యుడే అగ్నిగోళంగా భాసిస్తున్న సమయంలో ఆయనకు ఆశ్రయమిచ్చేవారే కరవయ్యారు. ఆ సమయంలో 12 మంది ఆదిత్యులను అమ్మగాక భరించగలిగిన వారెవరు? ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భృగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు వీరే ‘ద్వాదశాదిత్యులు’. అందుకే, అమ్మవారే వారిని తన కిరీటంలో మణులుగా చేసుకొని తలపై చంద్రవంకను అలంకరించుకున్నది. ఆ చంద్రునిపై ప్రతిబింబించిన సూర్యుల తేజస్సు ఇంద్రధనస్సును తలపింపచేస్తున్నది. ఈ అద్భుత సన్నివేశాన్నే దర్శించారు భగవత్పాదులు. ‘లలితా సహస్ర నామాల’లో ‘కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండితా’ అని ఒక నామం ఉన్నది. అది అమ్మవారు ధరించిన కిరీటాన్ని వర్ణిస్తున్నది. కురువిందాలు, పద్మరాగ మణులచేత ప్రకాశించే కిరీటాన్ని ధరించింది అమ్మవారు. కామం, అనురాగం మొదలైన గుణాలను ‘కురువిందం’ అంటారు. ‘రావణగంగ’ అనే నదీతీరంలో ఈ మణులు దొరుకుతాయని చెబుతారు. ఇవి స్వఛ్ఛమైన కాంతి కలిగినవి, అరుణవర్ణంలో ఉంటాయని ప్రతీతి.
మనసుకు ఆహ్లాదాన్నిస్తూ, అమ్మపట్ల అనురాగాన్ని పెంచుతూ, సాధనలో ఉన్నత స్థితిని కలిగించేందుకు ఈ మణులను ధ్యానంలో దర్శించాలని సాధకులు చెపుతారు. ఇవి సుప్తావస్థలో ఉన్న బుద్ధిని తేజస్వంతం చేస్తూ చైతన్య పరుస్తాయి. ఇక్కడ ‘కామం’ అనగానే కామగుణంగా తీసుకోవద్దు. ఆధ్యాత్మిక సాధకునికి అమ్మలో లయం కావడమే ఉన్నతమైన కోరిక. అదే సమున్నత సంకల్పం. అదే జ్ఞానసాధన, ఆచరణ. ఈ బుద్ధిని ప్రచోదన చేసి ముందుకు తీసుకెళ్ళేవి కురువిందాది మణులు. శుద్ధ స్పటికాలచేత వ్యక్తమయ్యే కాంతి కాబట్టి, సప్తవర్ణాలలో ప్రకాశిస్తుంది. దానిని చూసిన సాధకుడు అది ఇంద్రధనస్సుగా భ్రమిస్తాడని చెపుతారు. సాధకుడు సాధనలో పరిశుద్ధ మనస్కుడైన పిమ్మట ఆ తేజస్సు ఇంద్రియాలను ప్రకాశవంతంగా చేస్తాయని చెపుతారు. అమ్మకూడా అరుణారుణ కాంతితో భాసిస్తుంది. ‘చంపకాశోక పున్నాగ సౌగంధీ కలసత్కచ’ (లలితా సహస్ర నామాలు). చంపకములు, సౌగంధికములు, అశోకములు, పున్నాగ లాంటివన్నీ అరుణవర్ణంలో ఉంటాయి. అలాగే, అరుణవర్ణంతో ప్రకాశించే కౌసుంబవస్ర్తాన్ని ధరిస్తుంది అమ్మవారు. ధ్యానంలో దర్శనమిచ్చే అమ్మవారి అరుణవర్ణం సాధకునిలో భక్తిని పెంచుతుందని, తద్వార త్రికరణశుద్ధిగా సమర్పణా భావనతో అమ్మను సేవిస్తారని చెపుతారు.
అమ్మను చూడటం ‘సాలోక్యస్థితి’. అమ్మను తానుగా భావించడం ‘సారూప్యస్థితి’. అమ్మను సమీపించడం ‘సామీప్యస్థితి’. అమ్మలో లయమవడం ‘సాయుజ్యస్థితి’. ఈ నాలుగు స్థితులూ ముక్తిని ప్రసాదించే మార్గాలు. ఇందులో ఒక దానికన్నా మరొక దానిని ఉన్నతంగా భావిస్తారు. అమ్మవారిని ధ్యానించడం వల్ల చివరిదైన ‘సాయుజ్యం’ ప్రాప్తిస్తుందని చెపుతారు. మరో ముఖ్యాంశం దేవతలను వర్ణిస్తున్నప్పుడు తలనుండి పాదాలవరకు, మనుషులను వర్ణిస్తే పాదాలనుండి తలవరకు వర్ణించడం సంప్రదాయం. శంకరుల ఆంతర్యాన్ని అర్థం చేసుకొని, ఆ మార్గంలో సాధనకు కావలసిన బుద్ధిని ప్రసాదించ వలసిందిగా అమ్మను ప్రార్థిద్దాం.
పాలకుర్తి రామమూర్తి