మాడ్రిడ్: మాస్క్ ధరించని ఒక వ్యక్తిని మహిళలు రైలు నుంచి తోసేశారు. స్పెయిన్ దేశంలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని అన్ని దేశాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాయి. మరోవైపు మాస్క్ ధరించని వారిపట్ల జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పెయిన్లో జరిగిన ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తున్నది.
లోకల్ ట్రైన్లో ఒక వ్యక్తి మాస్క్ ధరించకపోవడాన్ని చూసిన కొందరు ప్రయాణికులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు నుంచి దిగిపోవాలని అతడికి చెప్పారు. ఆ వ్యక్తి వినకపోవడంతో ఇద్దరు మహిళలు అతడ్ని బలవంతంగా డోర్ వద్దకు తోశారు. రైలు డోర్ వద్ద కొంత సేపు అతడు ప్రతిఘటించాడు. మరి కొందరు ప్రయాణికులు కూడా ట్రైన్ దిగాలని అతడికి గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలు ఆ వ్యక్తిని బలవంతంగా రైలు డోర్ నుంచి ఫ్లాట్ఫారం మీదకు తోసేశారు.
కాగా, స్టేషన్లో రైలు ఆగి ఉండగానే ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు మాస్క్ ధరించని వ్యక్తిని రైలు నుంచి బలవంతంగా దించిన ప్రయాణికుల చర్యను కొందరు నెటిజన్లు సమర్థించగా మరి కొందరు తప్పుపట్టారు.