లండన్, సెప్టెంబర్ 30: స్కాట్లాండ్లోని గ్లాస్కోలో గురుద్వారా కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన లండన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఆహ్వానం లేదంటూ వెనక్కి పంపడంతో ఉద్రిక్తత నెలకొంది. బ్రిటన్లోని ఏ గురుద్వారాలోనూ భారత అధికారులకు అనుమతి లేదని ఓ ఖలిస్థానీ మద్దతుదారు పేర్కొనడం గమనార్హం. హైకమిషనర్ను అడ్డుకోవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీన్ని అవమానకర చర్యగా పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. బ్రిటన్ స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భారత్కు హామీ ఇచ్చింది. భారతీయులను గురుద్వారాలకు వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని, అందరికీ ఆహ్వా నం ఉంటుందని పేర్కొంది. కొంతమంది ప్రచారం కోసం ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపింది.
ఆధారాలుంటే చూపించండి
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో కెనడా ఆరోపణలను భారత్ మరోసారి ఖండించింది. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరింది. అమెరికాలోని వాషింగ్టన్లో శనివారం విదేశాంగ మంత్రి జై శంకర్ విలేకర్లతో మాట్లాడారు. భారత ఎంబసీ, దౌత్యవేత్తలకు బెదిరింపులు వస్తున్నాయని, భారత్ స్థానంలో మీరు ఉంటే ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.