రష్యా దాడిపై పశ్చిమ దేశాలు భగ్గు
ప్రణాళిక ప్రకారమే పుతిన్ దాడి
ప్రాణ నష్టానికి రష్యాదే బాధ్యత: బైడెన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఐరోపాలో శాంతికి రష్యా విఘాతం కలిగించిందని ఆరోపించాయి. పుతిన్ ఒక ప్రణాళిక ప్రకారమే యుద్ధాన్ని ఎంచుకొన్నారని, విధ్వంసపు దారిలో ప్రయాణిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆరోపించారు. జరిగే ప్రాణ నష్టానికి రష్యాదే బాధ్యత అని హెచ్చరించారు. ‘పుతిన్ యూరప్లో యుద్ధ జ్వాలను రగిల్చారు’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడం ‘ఐరోపా చరిత్రలో చీకటి రోజు’ అని జర్మనీ చాన్సలర్ స్కోల్జ్ అన్నారు. పుతిన్ చర్య ‘ఆటవిక దాడి’ అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్డర్ లీయెన్ అభివర్ణించారు. ఐరాస చీఫ్గా తన పదవీకాలంలో ఇదే అత్యంత బాధాకరమైన ఘటన అని ఆంటోనియో గుటెరస్ అన్నారు.
క్రూరమైన యుద్ధ చర్య
‘నాటో సభ్య దేశాల్లో ప్రతీ అంగుళాన్ని పరిరక్షించడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని నాటో సెక్రెటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ అన్నారు. తూర్పు ఐరోపా దేశాలకు నాటో బలగాలను పంపిస్తామన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఆయన ఖండించారు. అయితే, ఉక్రెయిన్కు ఇప్పుడే నాటో బలగాలను పంపబోమన్నారు.
పుతిన్.. జరుగబోయేవాటికి సిద్ధంగా ఉండు: బైడెన్
ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. రష్యా చర్య ఉక్రెయిన్ పౌరులపై క్రూరమైన దాడిగా అభివర్ణించారు. దౌత్యపరమైన అన్ని మార్గాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ జారవిడుచుకొన్నట్టు పేర్కొన్నారు. ‘పుతిన్ ఓ దురాక్రమణవాది. అందుకే ఈ తరహా యుద్ధాన్ని ఎంచుకొన్నారు. ఇకపై జరుగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రసంగించారు. దేశంలోని రష్యా అస్తులను ఫ్రీజ్ చేయడమే కాకుండా ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్కి తమ బలగాలను పంపించబోమని స్పష్టం చేశారు.