Alireza Tangsiri : ఇజ్రాయెల్తో యుద్ధంలో వరుసగా అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్న ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ ఎలైట్ నావెల్ ఫోర్స్ (నావికా దళం) చీఫ్ అలీరెజా తాంగ్సిరి మరణించాడు. తాము జరిపిన వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ నావికా దళానికి నాయకత్వం వహిస్తున్న టాప్ కమాండర్ అలీరెజాను పోర్ట్ సిటీ అయిన బందాకం అబ్బాస్ వద్ద హతమార్చినట్లు ప్రకటించింది.
అలీరెజా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీలోని నావికా దళ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూసి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అసలు ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం అలీరెజానే. అతడు మరణించాడని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, ఇరాన్ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇరాన్, దేశ భద్రతా దళాలు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. 2018 నుంచి అలీరెజా నావికాదళానికి నేతృత్వం వహిస్తున్నాడు. ఆయనను సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ నియమించాడు. ఇరాన్ నావికా దళ సామర్ధ్యం పెంచడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. దేశంలో తొలి డ్రోన్ క్యారియర్ నౌకను ఆవిష్కరించాడు. తమకు ఎదురొస్తే నరకాన్ని చూపిస్తామని శతృవులను హెచ్చరించాడు.
అలాగే, తమతో సముద్ర ప్రాంతంలో పోరాడే స్తాయి అమెరికాకు లేదని గత ఏడాది అలీరెజా తెలిపాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ వరుసగా ఇరాన్పై దాడులకు దిగుతోంది. ఒకేసారి అటు ఇరాన్పై, ఇటు లెబనాన్పై దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ స్థావరాలపై కూడా దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో తమ సైనికుడు మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.