ఆక్లాండ్: విమానంలో ప్రయాణించే వారి లగేజీ బరువుకు పరిమితులు ఉంటాయని దాదాపు అందరికీ తెలుసు. ఏ ఎయిర్లైన్స్లో అయినా ఈ లగేజీ బరువుకు పరిమితులు సాధారణమే అయినప్పటికీ.. ఎంతవరకు బరువును అనుమతించవచ్చనే పాలసీ విషయంలో మాత్రం ఎయిర్లైన్స్కు ఎయిర్లైన్స్కు మధ్య వ్యత్యాసం ఉంటుంది. కానీ, ఇప్పుడు న్యూజిలాండ్ ఎయిర్ లైన్స్ మాత్రం ఏకంగా విమానం ఎక్కే ప్రయాణికుడి బరువు కూడా చెక్ చేస్తామని చెబుతోంది.
బోర్డింగ్ పాస్ జారీచేసే దగ్గరే ప్రయాణికుల బరువు కూడా చెక్ చేస్తామని తెలిపింది. ప్యాసెంజర్ వెయిట్ సర్వే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. ఈ సర్వే వల్ల విమానం గాల్లోకి ఎగరడానికి ముందే ఆ విమానంలో ఎంత బరువు ఉందో పైలట్కు తెలుస్తుందని న్యూజిలాండ్ ఎయిర్ లైన్స్ పేర్కొంది. జూన్ నెల పూర్తిగా ఈ ప్యాసెంజర్ వెయిట్ సర్వే కొనసాగుతుందని, ఆ నెలలో తమ ఎయిర్లైన్స్లో ప్రయాణించబోయే 10 వేల మంది ప్రయాణికులు ఈ సర్వే భాగస్వాములవుతారని న్యూజిలాండ్ ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది.
సర్వేలో భాగంగా ప్రయాణికుల బరువు తూచేందుకు ఆక్లాండ్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రయాణికుల బరువు చెక్ చేసేటప్పుడు వాళ్లు ఎంత బరువు ఉన్నారనేది ఎక్కడా డిస్ప్లేలో కనిపించదని, దాంతో వాళ్లు ఎంత బరువు ఉన్నారనేది ఇతరులు ఎవరికీ తెలియదని, ఎయిర్లైన్స్ సిబ్బందికి కూడా ఎవరి బరువునూ తెలుసుకునే అవకాశం ఉండదని, ప్రయాణికుల సంఖ్య, వారి బరువుల వివరాలు నేరుగా పైలట్కు మాత్రమే వెళ్తాయని న్యూజిలాండ్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ప్రయాణికుల రక్షణ కోసమే తాము ఈ ప్యాసింజర్ వెయిట్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపింది.