న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్లో భీకర వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్లో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సాయం అవసరమైతే రాయబార కార్యాలయాలన్ని సంప్రదించాలని ఇండియన్ ఎంబసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు ఈనెల 14 వరకూ ఎయిరిండియా విమానాల రాకపోకలను (Air India flights) నిలిపివేశారు. తమ ప్రయాణీకులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్లైన్ ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు.
ఈ వ్యవధిలో ఏ విమానంలోనైనా బుకింగ్స్ చేసుకున్న ప్రయాణీకులకు అవసరమైన సపోర్ట్ అందిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి కారణంగా శనివారం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు, టెల్ అవీవ్ నుంచి న్యూఢిల్లీకి రిటన్ ఫ్లైట్ను రద్దు చేశారు. హమాస్ ఫైటర్లు దేశంలోకి చొచ్చుకురావడం, గాజా నుంచి క్షిపణి దాడులో దేశంలో యుద్ధానికి తెరలేచినట్టేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారత పౌరులందరూ సురక్షితంగా ఉండాలని, ఎలాంటి సాయం కావాలన్నా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ. మురళీధరన్ (MoS Muraleedharan) విజ్ఞప్తి చేశారు.
ఇజ్రాయెల్లో భారత పౌరులందరికీ భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసిందని, మన పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్ధితి ఉత్పన్నమైనా ఎంబసీతో సంప్రదింపులు జరపాలని కోరామని తెలిపారు. ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని, స్ధానిక అధికారులు నిర్ధేశించిన భద్రతా ప్రమాణాలను అనుసరించాలని ఇజ్రాయెల్లో భారత రాయబార కార్యాలయం శనివారం భారత పౌరులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అనవసరంగా బయటతిరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ గైడ్లైన్స్లో కోరింది. ఇక ఇజ్రాయెల్లో హమాస్, ఇజ్రాయెల్ సైనిక బలగాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.
Read More :