Nushrat Bharucha | ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ మారణహోమంలో ఇప్పటికే ఇరుదేశాల్లో 500 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రాకెట్ కాల్పులు, సైరన్ శబ్దాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇరు దేశాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్థులు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి నుస్రత్ భరోచా కూడా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయెల్ వెళ్లిన నుస్రత్ భరోచా శనివారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు తన టీమ్తో టచ్లో ఉంది. ఆ తర్వాత ఆమె నుంచి సమాచారం లేదని.. తనతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని నుస్రత్ టీమ్ సభ్యుల్లో ఒకరు తెలిపారు.
చివరి సారిగా నుస్రత్కు, ఆమె టీమ్కు సంభాషణ జరిగినప్పుడు ఆమె బేస్మెంట్లో అందరితో పాటు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారని అన్నారు. ఆ తర్వాత నుస్రత్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదని చెప్పారు. ఈ విషయం తెలిసి నుస్రత్ ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. ఈ క్రమంలో ఆమె సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో నుస్రత్ ఎయిర్పోర్టుకు చేరుకుందని సమాచారం. అంతేకాదు మరికాసేపట్లో భారత్కు రాబోతుందని తెలుస్తోంది.
నుస్రత్ తెలుగులో శివాజీతో కలిసి తాజ్మహల్ సినిమా చేసింది. తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేసింది. హిందీలో ప్యార్ కా పంచనామా, సోనూ కే టిట్లు కీ స్వీటీ, డ్రీమ్ గర్ల్ వంటి సినిమాలో అక్కడ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివరిగా నుస్రత్ అకేలి సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన చోరీ-2 రిలీజ్కు సిద్ధంగా ఉంది.