బీజింగ్: షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో గత రెండు నెలల నుంచి తీవ్రమై కోవిడ్ ఆంక్షలను అమలు చేశారు. గత రాత్రి నుంచి నగరంలోని ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. షాంఘైలో సుమారు 2.5 కోట్ల జనాభా ఉంది. అయితే దీంట్లో 6.50 లక్షల మంది తమ ఇండ్లకే పరిమితం కానున్నారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. కోవిడ్ సోకిన వారు క్వారెంటైన్ కావాలి లేదా హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. కోవిడ్ సోకిన వారి సమీప వ్యక్తులను కూడా తక్షణమే పరీక్షిస్తున్నారు.
అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేవాళ్లు కచ్చితంగా కొత్త రూల్స్ పాటించాలి. తమ స్మార్ట్ఫోన్లపై గ్రీన్ హెల్త్ కోడ్ను చూపిస్తేనే ఇంటి కాంపౌండ్ లేదా బిల్డింగ్ దాటేందుకు అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థను వాడాలన్నా, లేక బ్యాంకులకు వెళ్లాలన్నా, మాల్స్కు పోవాలనుకున్నా, కచ్చితంగా 72 గంటల లోపు తీసిన నెగటివ్ పీసీఆర్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది. మరో పట్టణానికి వెళ్లి వచ్చిన వారు 14 రోజుల క్వారెంటైన్లో ఉండాలి.