బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రోజూ కోటికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజధాని బీజింగ్ సహా ఏ నగరంలో, పట్టణంలో చూసినా భారీ సంఖ్యలో జనం కరోనా ఇన్ఫెక్షన్ బారినపడుతున్నారు. ఒక్కో నగరంలో లక్షల సంఖ్యలో కొత్తగా రోజువారీ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇక ముఖ్యంగా జెజియాంగ్ సిటీలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఆ నగరంలో ప్రస్తుతం రోజుకు ఇంచుమించుగా 10 లక్షల చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని జెజియాంగ్ ప్రావిన్స్ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. న్యూఇయర్ నాటికి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య డబుల్ అయ్యే ప్రమాదం ఉన్నదని జెజియాంగ్ గవర్నమెంట్ ఆందోళన వ్యక్తంచేసింది.
కానీ, చైనా సర్కారు మాత్రం తమ దేశంలో కరోనా కంట్రోల్లోనే ఉన్నదని చెబుతున్నది. ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోయినా, శ్మశానాల్లోకి మృతదేహాలను తీసుకెళ్లిన వాహనాలు భారీ క్యూలైన్లలో నిలిచిపోయినా చైనా ప్రభుత్వం మాత్రం ఏమీ ఎరగనట్టు అంతా ప్రశాంతమేనని ప్రకటిస్తూ చేతులు కడిగేసుకుంటున్నది. బీజింగ్లో లాక్డౌన్ ఎత్తేసినప్పటి నుంచి రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యను వెల్లడించడం కూడా మానేసింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఆ దేశంలో పూర్తి భిన్నంగా ఉన్నది.