Floods @ Pakistan | భారీ వరదలు పాకిస్తాన్ను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీటి మధ్యనే ఉన్నాయి. వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, పాకిస్తాన్లో ఇప్పటికీ 80 లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నారు. 6 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయలేదు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడంతో పిల్లలకు డయేరియా, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇళ్లకు తిరిగి వస్తున్న వారికి ఆహారం, నీరు, మందులు వంటి నిత్యావసరాల కొరత ఎదురవుతున్నది. ఇప్పటివరకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
సింధ్లోని 11 జిల్లాలు, బలూచిస్థాన్లోని 2 జిల్లాల్లో వరద నీరు ఇప్పటికీ అలాగే ఉండటంతో పరిస్థితులు అధ్వానంగా మారాయి. సింధ్లోని దాదు, కంబర్-షహదాద్కోట్, ఖైర్పూర్, మిర్పుర్ఖాస్, జంషోరో, సంఘర్, ఉమర్కోట్, బాడిన్, షహీద్ బెనజీరాబాద్, నౌషహ్రో ఫిరోజ్తోపాటు బలూచిస్తాన్లోని సోహబత్పూర్, జఫరాబాద్ జిల్లాల్లో ప్రజలు ఇప్పటికీ వరద నీటి ముంపునకి గురయ్యారు. దక్షిణ సింధ్లో దాదాపు 2.5 లక్షల మంది స్వదేశానికి తిరిగి రాలేకపోయినట్లు తెలుస్తున్నది.
సెప్టెంబర్ నుంచి మలేరియా కేసులు బలూచిస్తాన్లో 25 శాతం, ఖైబర్-పఖ్తూన్లో 58 శాతం, సింధ్లో 67 శాతం తగ్గాయి. అయినప్పటికీ ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఇప్పటికీ ఆహార కొరత సమస్యతో పోరాడుతున్నారు. వచ్చే జనవరి-మార్చి మధ్య అత్యవసర ఆహార సంక్షోభం కనిపిస్తుందని నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.