సనా: యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో మరో పడవ బోల్తా (Boat Sink) పడింది. దీంతో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు జలసమాధి అయ్యారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసదారుల సంస్థ వెల్లడించింది. 154 మంది ఇథియోపియన్ జాతీయులతో (Ethiopian nationals) వెళ్తున్న పడవ అడెన్ గల్ఫ్ తీరంలో (Gulf of Aden) నీట మునిగిందని సౌథర్న్ యెమెనీ (Yemen) ప్రావిన్స్ సీనియర్ హెల్త్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదిర్ బజామిల్ తెలిపారు. ఇప్పటివరకు 10 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. వారిలో తొమ్మిది మంది ఇథియోపియన్ జాతీయులు ఉండగా, ఒకరు యెమెన్కు చెందినవారని వెల్లడించారు. ఖన్ఫర్ జిల్లా తీరానికి 54 మృతదేహాలు కొట్టుకొచ్చాయని, మరో 14 మృతదేహాలు వేరే ప్రాంతంలో గుర్తించినట్లు చెప్పారు. వాటిని స్థానిక దవాఖానకు తరలించామని పేర్కొన్నారు. ఇంకా 74 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు.
గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని యెమెన్కు చెందిన అబ్యాన్ భద్రతా విభాగం పేర్కొంది. బలమైన అలల కారణంగా గాలింపు చర్యలు కష్టంగా మారిందన్నారు. కాగా, ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి ప్రధాన మార్గంగా యెమెన్ ఉంది. తూర్పు, హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాల నుంచి గల్ఫ్ అరబ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వలసదారులు ఈ మార్గం నుంచే వెళ్తారు. అయితే ఎర్ర సముద్రం లేదా అడెన్ గల్ఫ్ మీదుగా తరచుగా ప్రమాదకరమైన, రద్దీగా ఉండే పడవల్లో వలసదారులను స్మగ్లర్లు తరలిస్తుంటారు. ఇటీవల నెలల్లో యెమెన్ తీరంలో జరిగిన బోటు ప్రమాదాల్లో వందల సంఖ్యలో వలసదారులు మృతి చెందడం లేదా గల్లంతయ్యారు. మార్చి నెలలో యెమెన్, జిబౌటి తీరాల్లో నాలుగు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ఇద్దరు వలసదారులు మృతి చెందగా, 186 మంది గల్లంతయ్యారని ఐఓఎం తెలిపింది.
54 migrants DEAD after boat sinks off Yemen’s coast #Yemen
Due to ‘bad weather’
2019 footage shows this has happened many times before
Who’s behind this dangerous trade in bodies? pic.twitter.com/TlcVb9YNI9— Uncensored News (@Uncensorednewsw) August 3, 2025