కొత్త ఏడాది తొలిగంటల్లోనే జపాన్ భయకంపితమైంది. వరుస భూకంపాలతో ద్వీపదేశం చిగురుటాకులా వణికిపోయింది. 2004నాటి సునామీ దృశ్యం కండ్లముందు కదిలింది. గంటల వ్యవధిలో 50కి పైగా భూకంపాలు వరుసగా కుదిపేశాయి. రోడ్లు, భవంతులు ధ్వంసమయ్యాయి. మరోవైపు సునామీ హెచ్చరికలతో ప్రపంచం కలవరపాటుకు గురైంది.
Japan Earthquake | టోక్యో, జనవరి 1: నూతన సంవత్సరం మొదటి రోజున సంభవించిన వరుస భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా, సమీప ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4 గంటల తర్వాత రిక్టర్ స్కేల్పై 3.2 పైగా తీవ్రతతో కూడిన 50కి పైగా వరుస భూకంపాలు సంభవించాయి. వీటిలో ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. భూకంపాల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని పలు చోట్ల రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి.
పలు చోట్ల శిథిలాల కింద ప్రజలు చిక్కుకొన్నట్టు తెలుస్తున్నది. ఇద్దరు మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే భూకంపాల వల్ల మొత్తం మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై మాత్రం పూర్తి స్పష్టత లేదు. వరుస భూకంపాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు చేసిన అధికారులు.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ఇషికావాకు అధిక స్థాయి సునామీ హెచ్చరికలు జారీచేసిన జపాన్ వాతావరణ సంస్థ.. హోన్షు, హొక్కాయిడో తదితర ప్రాంతాలకు తక్కువ స్థాయి సునామీ హెచ్చరికలు ఇచ్చింది.
ఇషికావాలోని నోటో పట్టణ సముద్ర తీరంలో ముందు ‘మేజర్ సునామీ’ హెచ్చరిక చేశారు. అలలు 5 మీటర్ల ఎత్తుకు ఎగిసే అవకాశం ఉన్నదని, ప్రజలు వీలైనంత తర్వాత సమీపంలోని ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని లేదా భవనాలపైకి చేరాలని జపనీస్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్హెచ్కే టీవీ హెచ్చరించింది. మేజర్ సునామీ హెచ్చరికను కొన్ని గంటల తర్వాత అధికారులు సాధారణ సునామీ హెచ్చరికకు తగ్గించారు. రాకాసి అలలు సంభవించే అవకాశం ఇప్పటికీ ఉన్నదని, ప్రస్తుతానికి ఇండ్లకు తిరిగి వెళ్లొద్దని తీర ప్రాంత వాసులకు సూచించారు.
ఎగిసిపడిన సునామీ అలలు
సునామీ హెచ్చరికల తర్వాత ఇషికావాలోని నోటో తీరాన్ని 5 మీటర్ల వరకు ఎత్తున అలలు తాకాయి. నిగిటా, తొమయా తదితర ప్రాంతాల్లో మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయని ఎన్హెచ్కే నివేదించింది. మరోవైపు వాజిమా పోర్టును 1.2 మీటర్ల ఎత్తున అలలు తాకగా.. పలు ఇతర ప్రాంతాల్లో కూడా చిన్నపాటి సునామీలు సంభవించాయి. కాగా, భూకంప ప్రాంతాల్లో ఉన్న అణు విద్యుత్తు ప్లాంట్లపై ప్రభావం పడలేదని, రేడియోయాక్టిక్ లీక్ రిస్క్ లేదని జపాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అధికారులు పేర్కొన్నారు.
హైవేల మూసివేత.. రైళ్ల రద్దు
భూకంపాల ధాటికి పలుచోట్ల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సుకు పట్టణంతో పాలు పలు ప్రాంతాల్లో పలువురు భవన శిథిలాల కింద చిక్కుకొన్నట్టు తెలుస్తున్నది. భూకంప కేంద్రానికి సమీపంలోని పలు ప్రధాన హైవేలను మూసివేశారు. ఇషికావా రీజియన్కు వెళ్లే హైస్పీడ్ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
ఇషికావా, నిగాటాలలో ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని టెలికం సంస్థలు పేర్కొన్నాయి. 34 వేల ఇండ్లకు పైగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి హయషి పేర్కొన్నారు. మరణాలు సంభవించినట్టు, ప్రజలు గాయపడినట్టు ఎలాంటి నివేదికలు లేవని, పరిస్థితి ఇంకా అస్పష్టంగా ఉన్నదన్నారు.
వీధుల్లోకి పరుగుపెట్టిన ప్రజలు
వచ్చే వారంలో ప్రధానంగా 2-3 రోజుల్లో మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నదని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తాజా భూకంపాల నేపథ్యంలో జపాన్ సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. వాజిమా పట్టణంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. వరుస భూకంపాలతో భయాందోళనలతో ప్రజలు వీధుల్లో పరిగెడుతున్న దృశ్యాలను స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. కాగా, జపాన్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గత ఏడాది మేలో రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా రీజియన్లోనే ఉన్నది.
అప్రమత్తమైన సమీప దేశాలు
జపాన్లో వరుస భూకంపాల నేపథ్యంలో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. షకాలిన్ ద్వీపానికి రష్యా అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. షకాలిన్ పశ్చిమ తీర ఏరియాలను పెద్ద అలలు తాకే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో తూర్పు తీర పట్టణాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రపు మట్టం స్థాయిల్లో మార్పులను గమనిస్తూ ఉండాలని స్థానిక వాతావరణ సంస్థ సూచించింది.
భారత రాయబార కార్యాలయంలో కంట్రోల్ రూమ్
జపాన్లో భూకంప తీవ్రత కారణంగా సునామీ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో టోక్యోలోని రాయబార కార్యాలయంలో భారత్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. భారతీయులకు తగిన సమాచారంతో కూడిన సాయం అందించేందుకు రాయబార కార్యాలయ సిబ్బంది ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలతో ఒక ప్రకటన విడుదల చేసింది. భూకంపం, సునామీ హెచ్చరికలకు సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా సంప్రదించవచ్చునని తెలిపింది. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ప్రకటనలో సూచించింది.