రష్యా దాడుల్లో వైద్య సదుపాయాలు నాశనం: జెలెన్స్కీ
కీవ్/మాస్కో, మే 6: తమ దేశంలోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. దాదాపు 400 మేర దవాఖానలు, మెడికల్ ఇన్స్టిట్యూట్లను నాశనం చేసిందని, దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మెడికల్ ఛారిటీ గ్రూపును ఉద్దేశించి జెలెన్స్కీ వీడియో ప్రసంగం చేశారు. రష్యా విధ్వంసకాండ కారణంగా క్యాన్సర్ రోగులకు మందులు, డయాబెటిస్ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులో లేకుండా పోయాయని, వైద్యులు సర్జరీలు కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు రష్యా తప్పక విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది.
అణ్వాయుధాలు వినియోగించం: రష్యా
ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించబోమని రష్యా శుక్రవారం పేర్కొన్నది. ఉక్రెయిన్లో తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్కు న్యూక్లియర్ ఆయుధాలను వినియోగించడం వర్తించదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అలెక్సీ అన్నట్టు రాయిటర్స్ తెలిపింది. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనతో రష్యా అణు ఆయుధాలు ప్రయోగించే అవకాశం ఉన్నదని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.