Philippines : ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.37 గంటల సమయంలో 7.8 తీవ్రతతో దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావంతో నలుగురు మరణించారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్లో భూంకపాలు రావడం సాధారణమే. అయితే, వాటి తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి భూకంపం మాత్రం ఈ ఏడాదిలోనే చాలా పెద్దది. ఈ భూకంప కేంద్రం ఫిలిప్పీన్స్, నైరుతి జనలర్ శాంటోస్ నగరానికి దక్షిణాన ఉన్న మిండానో ప్రాంతంలో కేంద్రీకృతమైందని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
భూకంప ప్రభావంతో సునామీకి కూడా అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రతతో చాలా బిల్డింగులు, రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. కొన్ని స్వల్పంగా ధ్వంసమైతే, ఇంకొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. రవాణా, జనజీవనం స్తంభించింది. ఫిలిప్పీన్స్తోపాటు ఇండోనేసియా, మలేసియాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా దేశాల్లోని తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వాలు సూచించాయి. కూలిన శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనే విషయంపై ఇంకా అధికారుల నుంచి ఎలాంటిస్పష్టతా లేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జనరల్ శాంటోస్ నగరంలోని ఇంటర్నేషనల్ ఎయర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. భూకంపం కారణంగా జనరల్ శాంటోస్ నగరంలో స్కూళ్లలోని విద్యార్థుల్ని ఉన్నట్లుండి తరలిస్తున్న క్రమంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుల్తాన్ కుదారత్, సారంగాణివంటి ప్రాంతాల్లో మానిటరింగ్ సెంటర్లలో సునామీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.