Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల్ని ఇరాన్ అంత సులభంగా అనుమతించడం లేదు. దీంతో హార్ముజ్ వద్ద ప్రస్తుతం 360 వరకు వాణిజ్య నౌకలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వివిధ దేశాలకు చమురు, ఆహారం, ఇతర ఉత్పత్తులు రవాణా చేసే నౌకలివి. దీంతో ఆయా దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 360 వరకు నౌకలు చిక్కుకుపోవడంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు 40 నౌకలు మాత్రమే ఇక్కడినుంచి కదులుతున్నాయి. దీంతో నౌకా రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన సముద్ర రవాణా మార్గం ఇది. అంతర్జాతీయ ఆర్థిక ప్రగతికి కూడా ఈ మార్గం కీలకం. దాదాపు 20 శాతం నౌకలు ఈ మార్గం నుంచే వెళ్తాయి. అందులోనూ చమురు, గ్యాస్ నౌకలు ఎక్కువగా రవాణా జరిగేది ఈ ప్రాంతం నుంచే. అలాంటిది, ఇక్కడ నౌకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమరు సంక్షోభం మొదలైంది. చమురు మార్కెట్లు, ప్రభుత్వాలు, షిప్పింగ్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. షిప్పింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ ప్రకారం.. ఇక్కడ 360 వాణిజ్య, ఆహారోత్పత్తుల నౌకలు నిలిచిపోయాయి.
వీటిలో అతికష్టం మీద రోజుకు 40 నౌకలు మాత్రం కదులుతున్నాయి. ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల్ని రక్షించేందుకు అమెరికాకు చెందిన నౌకలు రక్షణ కల్పిస్తున్నాయి. అయినప్పటికీ, నౌకల రవాణా చాలా తక్కువగా ఉంది. ఇలాంటి యుద్ధం, దిగ్బంధం వంటి పరిస్థితుల్లో రక్షణ, సహాయం అందించడానికి ఈ ప్రాంతం అంత అనుకూలం కాదు. వన్ వే ట్రాఫిక్ సాధ్యం కాదు. అందుకే అనేక నౌకల్ని రక్షించడం కష్టంగా మారింది. దీంతో ప్రపంచం ఎప్పుడూ చూడని నౌకల బ్లాకేజ్ కొనసాగుతోంది.