వాషింగ్టన్: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, దాంతో పాటు మొత్తం 8 యుద్ధాలను ఆపినట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి వెల్లడించారు. క్యాపిటల్ హిల్లో ఇవాళ ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒకవేళ అమెరికా జోక్యం చేసుకోకుంటే, అప్పుడు సుమారు మూడున్నర కోట్ల మంది మరణించేవారని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పినట్లు ట్రంప్ గుర్తు చేశారు. దేశంలోనే, ఇతర దేశాల్లో ఉన్న అమెరికా పౌరులకు రక్షణ కల్పిస్తున్నామని, దీని పట్ల గర్వపడుతున్నామని, గత పది నెలల్లో 8 యుద్ధాలను ఆపానని, పాకిస్థాన్.. భారత్ మధ్య అణ్వాయుధ యుద్ధం జరిగేందని ట్రంప్ తన ప్రసంగంలో వెల్లడించారు.
నేను జోక్యం చేసుకోకుంటే 3.5 కోట్ల మంది ప్రజలు చనిపోయేవారని పాక్ ప్రధాని షెహబాజ్ చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. 9వ యుద్ధాన్ని కూడా ఆపేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర మానవహననం జరుగుతోందని, ఒకవేళ తాను ప్రెసిడెంట్గా ఉండి ఉంటే, ఈ యుద్ధం జరిగేది కాదు అని ఆయన అన్నారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ఇప్పటికే 80 కన్నా ఎక్కువ సార్లు ట్రంప్ చెప్పారు. అయితే 200 శాతం ట్రేడ్ టారిఫ్ విధిస్తానని బెదిరించడం వల్ల ఆ రెండు దేశాలు యుద్ధాన్ని విరమించుకున్నట్లు గతంలో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.