న్యూఢిల్లీ, ఆగస్టు 6: రోదసిలో విహరించాలని ఉవ్విళ్లూరేవారి కోసం అంతరిక్ష పర్యాటక సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ మరో అవకాశాన్ని తీసుకొచ్చింది. తమ స్పేస్ ఫ్లైట్లో విహరించేందుకు గురువారం బుకింగ్ను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఒక్కో టికెట్ ధరను 4,50,000 డాలర్లు (రూ.3.33 కోట్లు)గా నిర్ణయించింది. అయితే, గతంతో పోలిస్తే, టికెట్ రేటును రెట్టింపు చేయడం గమనార్హం. 2005, 2014లో జరిపిన టికెట్ బుకింగ్ సేల్లో ఒక్కో సీటుకు 2-2.5 లక్షల డాలర్ల చొప్పున వసూలు చేశారు. ఈ సేల్లో 600 మంది సీట్లను బుక్ చేసుకున్నారు. అయితే, ఇటీవల జరిపిన స్పేస్ యాత్ర విజయవంతం కావడంతోనే ‘వర్జిన్ గెలాక్టిక్’ టికెట్ రేట్లను అమాంతం పెంచినట్టు తెలుస్తున్నది. మరోవైపు, గురువారం నుంచి ప్రారంభమయ్యే తాజా సేల్లో రెండు టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు ‘వర్జిన్ గెలాక్టిక్’ ప్రకటించింది. ‘ఎర్లీ బర్డ్’ ఆఫర్ కింద ఇవ్వనున్న ఈ టికెట్లను దక్కించుకోవాలంటే సెప్టెంబర్ 1లోపు సైట్లో రిజిస్టర్ కావాలని వెల్లడించింది. కాగా, వర్జిన్ గెలాక్టిక్ రెండో రోదసి యాత్ర వచ్చే నెలలో, మూడో విడుత యాత్ర వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ఉండనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.