Istanbul Fire | టర్కీలోని ఇస్తాంబుల్ నగర పరిధిలో గల నైట్ క్లబ్లో మంగళవారం చెలరేగిన అగ్ని ప్రమాదంలో కనీసం 29 మంది మరణించారు. నైట్ క్లబ్ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో క్లబ్ మేనేజర్లతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో గాయపడిన ఒక వ్యక్తికి దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఫైరింజన్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా, గాయపడిన వారిని, మరణించిన వారిని దవాఖానలకు తరలిస్తున్నారు.
బెసిక్టాస్ జిల్లాలోని 16 అంతస్తుల భవనంలో ఈ మాస్క్య్వైరబుల్ నైట్ క్లబ్ ఉంది. మరమ్మతు, పునరుద్ధరణ పనుల కోసం క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్, బేస్ మెంట్ ఫ్లోర్లను మూసేశారు. ప్రమాద కారణాలపై విచారణ జరుగుతుందని ఇస్తాంబుల్ గవర్నర్ దవుత్ గుల్ మీడియాకు తెలిపారు. అగ్ని ప్రమాదం సంగతి తెలియగానే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరమ్మతు పనులు చేస్తున్న వారు బాధితులుగా మారతారని భావిస్తున్నారు. నైట్ క్లబ్ భవనంలో సేఫ్టీ ప్రమాణాలను అధికారులు పరిశీలిస్తున్నారని ఇస్తాంబుల్ మేయర్ ఎక్రీం ఇమామోగ్లు చెప్పారు.