Uganda School | ఆఫ్రికా దేశం (Africa Country) ఉగాండా (Uganda)లో దారుణం చోటు చేసుకుంది. అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ఏడీఎఫ్)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే (Mpondwe) పట్టణంలోని ఓ పాఠశాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
‘ఏడీఎఫ్ (ADF)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు లుబిరిరా సెకండరీ పాఠశాల (Lhubirira secondary school)పై దాడులు జరిపారు. పాఠశాలకు చెందిన డార్మిటరీని కాల్చేశారు. ఫుడ్ స్టోర్ ను కూడా దోచుకున్నారు. ఇప్పటివరకు 25 మంది మృతదేహాలను వెలికితీశాము. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించాం’ అని ఉగాండా పోలీసు శాఖ ప్రతినిధి ఫ్రెడ్ ఎనాంగే వెల్లడించారు. దాడి అనంతరం తిరుగుబాటుదారులు కాంగో దేశంలోని విరుంగా జాతీయ పార్కు దిశగా పారిపోయినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నట్టు చెప్పారు.
తూర్పు ఉగాండాలో 1990వ దశకంలో ఈ ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. 1986 నుంచి అక్కడ అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవెరీ ముసెవెని పాలనను ఏడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం చేతిలో ఓటమి తర్వాత.. డీఆర్సీలోని నార్త్ కివు రాష్ట్రంలో రీలొకేట్ అయ్యింది. అక్కడి నుంచి గత రెండు దశాబ్దాలుగా ఈ ఏడీఎఫ్ సభ్యులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తోనూ సంబంధాలు ఉన్నాయి. 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన భీకర బాంబు దాడి ఈ ఏడీఎఫ్ పనేనని ఆరోపణలు ఉన్నాయి.
Also Read..
Adipurush | దేశ ప్రజలకు ఆదిపురుష్ టీం క్షమాపణలు చెప్పాలి : శివసేన ఎంపీ
Manipur Violence | మణిపూర్ ను ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు.. ఆర్మీ విశ్రాంత అధికారుల ఆవేదన
Donald Trump | రెస్టారెంట్ లో బిల్లు కట్టకుండా జారుకున్న ట్రంప్.. నెట్టింట ట్రోల్స్