లండన్: యూకే – ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్లో మొదటి విడతగా 2,400 మంది నిపుణులైన భారతీయ యువతకు యూకే వీసాలు ఇవ్వనున్నట్టు అక్కడి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. గత నెల అధికారికంగా ప్రారంభించిన ఈ స్కీమ్ కింద 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు గల భారతీయ యువత రెండేండ్ల పాటు బ్రిటన్లో పనిచేసేందుకు, నివసించేందుకు వీసా ఇస్తారు. ఈ వీసా కోసం ముందుగా అర్హతను పరీక్షించుకొని బ్యాలెట్లోకి చేరాల్సి ఉంటుంది. బ్యాలెట్లో ఎంపికైన వారు వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. మొదటి బ్యాలెట్ ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 2న ముగుస్తుంది. బ్యాలెట్లో ఎంపికైన వారు నిర్దేశించిన సమయం లోపు వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీసా వచ్చిన తర్వాత ఆరు నెలల్లోపు యూకేకు వెళ్లాలి.