Japan Earthquake | నూతన సంవత్సరం మొదటి రోజున వరుస భూకంపాలతో జపాన్ (Japan Earthquake) వణికిపోయింది. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా ప్రిఫిక్షర్ (Ishikawa prefecture) సమీప ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4 గంటల తర్వాత రిక్టర్ స్కేల్పై 4 కంటే ఎక్కువ తీవ్రతతో 155 సార్లు భూమి (Earthquakes) కంపించిందని జపాన్ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతోపాటు 6 తీవ్రత నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఆరుసార్లు శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది.
ఇక భూకంపం ధాటికి వేల ఇళ్లు, భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ సుమారు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ మీడియా వెల్లడించింది అందులో ఇషికావా నగరంలోనే అత్యధిక మంది మరణించినట్లు పేర్కొంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జపాన్లో సునామీ రావడంతో అలలు మీటరు ఎత్తు వరకు ఎగసిపడ్డాయని, దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 43 వేలకు పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు. ఇషికావా తీరంలో అలలు విరుచుకుపడ్డాయి.
ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సముద్ర తీర ప్రాంతం అయిన ఇషికావాలో మరణాల సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, జపాన్ వాతావరణ సంస్థ సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించడం కాస్త ఊరట కల్పిస్తోంది. కానీ మరోసారి భూ ప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read..
Jr NTR | జపాన్ భూకంపం ఘటనపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. గత వారం అక్కడే ఉన్నా అంటూ ట్వీట్
Yogiraj Arun: రామ్ లల్లాను చెక్కిన శిల్పి యోగిరాజ్ అరుణ్ ఇతనే.. అతని తల్లి, భార్య ఏమన్నారంటే
NREGA | ఆధార్తోనే ఉపాధి హామీ వేతన చెల్లింపులు.. కొత్త ఏడాది క్రూరమైన కానుకని విపక్షం మండిపాటు