NREGA |న్యూఢిల్లీ, జనవరి 1: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆధార్ ఆధారిత(ఏబీపీఎస్) విధానంలో జరగనున్నాయి. గత ఏడాది జనవరి 30 నుంచే ఈ విధానాన్ని తప్పనిసరి చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డాటా బేస్ను బలోపేతం చేసుకొనేందుకు అయిదుసార్లు పొడిగింపు ఇచ్చారు. ఈ కొత్త విధానం ప్రకారం ఉపాధి హామీ పథకం కూలీల జాబ్ కార్డు, బ్యాంక్ ఖాతా ఆధార్తో అనుసంధానమై ఉండాలి. ఆధార్ సంఖ్యను వ్యక్తుల ఆర్థిక చిరునామాగా ఈ విధానం ఉపయోగిస్తుంది. దాంతోపాటు బ్యాంక్ ఖాతా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘మప్పర్’తో అనుసంధానమై ఉండాలి. ఏ రాష్ర్టానికి ఈ విషయంలో ఫిర్యాదులుంటే వ్యక్తిగతంగా ఒక్కొక్క కేసును చర్చిస్తామని చెప్పింది.
లిబ్ టెక్ ఇండియా సంస్థ లెక్కల ప్రకారం గత 21 నెలల్లో 7.6 కోట్ల జాబ్ కార్డులను సిస్టమ్ నుంచి తొలగించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నాటికి 14.28 కోట్ల యాక్టివ్ వర్కర్లు ఉండగా అందులో 13.48 కోట్ల మంది ఆధార్ సీడింగ్ జరిగింది. 12.90 కోట్ల మంది ఆధార్ను ధ్రువీకరించారు. సుమారు 12.49 కోట్ల వర్కర్లు ఏబీపీఎస్కు మారారు. ఇంకా 12.5 శాతం యాక్టివ్ వర్కర్లు ఏబీపీఎస్లో వివరాలు నమోదు చేసుకోలేదు. ఉపాధి హామీ పథకంలో మొత్తం వర్కర్లు 25.89 కోట్లు ఉండగా వారిలో 17.37 కోట్ల మంది ఏబీపీఎస్కు మారారు. 32 శాతం వర్కర్లు ఏబీపీఎస్కు అర్హులు కారు. ఏబీపీఎస్ను తప్పనిసరి చేయడం వల్ల పథకం నుంచి వర్కర్లను మినహాయించాల్సిన పరిస్థితులకు దారి తీస్తుందని ఈ పథకంపై పరిశోధన చేస్తున్న లావణ్య తమంగ్ అభిప్రాయపడ్డారు. అధికార యంత్రాంగం, మౌలిక సదుపాయాలు సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వం ఒక విషయాన్ని తప్పనిసరి చేస్తే ప్రజలు ఉపాధిని కోల్పోతారని ఆమె అన్నారు.
ఆధార్ ఆధారిత వేతన చెల్లింపును తప్పనిసరి చేయడంపై కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. దేశంలోని కోట్లాది నిరుపేదలు, అణగారిన వర్గాల వారు ప్రాథమిక(బేసిక్) ఆదాయాన్ని సంపాదించుకోకుండామినహాయించే క్రూరమైన కొత్త ఏడాది కానుక ఇది అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ హాజరు, డ్రోన్లతో పర్యవేక్షణ లాంటి సాంకేతికతను ఆయుధంగా వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. దీన్ని మానుకోవాలని హితవు పలికారు. ఉపాధి హామీ పథకానికి ప్రజాదరణ ఉన్నా ఇటీవల కాలంలో దాని బడ్జెట్లో కోతలు విధిస్తున్నారు. గతేడాది రూ.60 వేల బడ్జెట్ కేటాయించగా సవరించిన అంచనాలతో పోలిస్తే 33 శాతం కేటాయింపులు తగ్గించడంపై ఆందోళన వ్యక్తమైంది. ఈ పథకాన్ని 2013 నుంచి కాగ్ ఆడిట్ చేయడం లేదు.